మామిడితో మెరిసే అందం!

వేసవి అంటే.. ఎర్రటి ఎండలకు భయపడ్డా, కమ్మని నోరూరించే మామిడి పండ్ల కోసం ఎండ వేడిని భరించడానికి కూడా సిద్ధమంటారు చాలామంది.. కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదు మించకుండా తింటే దీనివల్ల....

Published : 10 May 2023 20:47 IST

వేసవి అంటే.. ఎర్రటి ఎండలకు భయపడ్డా, కమ్మని నోరూరించే మామిడి పండ్ల కోసం ఎండ వేడిని భరించడానికి కూడా సిద్ధమంటారు చాలామంది.. కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదు మించకుండా తింటే దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయట. అయితే కేవలం తినడం వల్లే కాదు.. మామిడి పండు గుజ్జును సౌందర్య పరిరక్షణకు ఉపయోగించడం వల్ల కూడా మెరిసే మోమును మన సొంతం చేసుకోవచ్చు. మరి, మామిడి పండు గుజ్జుతో మన చర్మాన్ని, జుట్టును కాపాడుకునేందుకు ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలో తెలుసుకుందాం రండి..

ముల్తానీ మట్టితో కలిపి..

మామిడిలో ఉన్న సుగుణాల వల్ల ముఖ చర్మం నిగనిగలాడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడమే కాదు.. చక్కటి మెరుపు కూడా సొంతమయ్యేలా చేస్తుంది. దీనికోసం ఒక మామిడి పండు గుజ్జు తీసుకోవాలి. మామిడి పండు గుజ్జు తీసేటప్పుడు తొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొక్కను ఫేస్‌ప్యాక్‌లో రాకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే దీనివల్ల చర్మానికి దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కేవలం గుజ్జును మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మామిడి గుజ్జుకు సమాన పాళ్లలో ముల్తానీ మట్టిని కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకొని దాన్ని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. అలా పావు గంట పాటు ఉంచుకొని ఆపై గుండ్రంగా మసాజ్ చేసుకుంటూ చల్లని నీటితో ప్యాక్ తొలగించుకోవాలి.

ఓట్‌మీల్ తోనూ..

ఓట్‌మీల్ మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మంచి చేస్తుందన్న సంగతి తెలిసిందే. దీనికి మామిడి పండు గుజ్జును చేరిస్తే ఆ ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి. దీనికోసం ఏడెనిమిది బాదం పప్పులను నీటిలో నానబెట్టి పొట్టు తీసి, వాటికి రెండు టీస్పూన్ల పాలు, కొద్దిగా ఓట్స్, నీళ్లు, ముల్తానీ మట్టి, ఒక మామిడి పండు గుజ్జు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావు గంట పాటు ఉంచుకొని కడిగేస్తే సరిపోతుంది. దీన్ని వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.

ట్యాన్‌కి టాటా..

ఎండాకాలంలో ఎక్కువగా ఎదురయ్యేది ట్యాన్ సమస్య. దీనికి వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మామిడి పండు గుజ్జులో నాలుగు టేబుల్ స్పూన్ల శెనగ పిండి, నాలుగైదు బాదం పప్పుల పొడి, తేనె కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని ఎండ వల్ల నల్లగా మారిన భాగాల్లో అప్త్లె చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ట్యాన్ తొలగిపోతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్యాక్‌ని వేసుకోవడం వల్ల నల్లగా మారకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని