తేన్పులు తగ్గాలంటే..
చూడ్డానికి చిన్నదిలానే ఉంటుంది కానీ.. ఒక్కోసారి ఏ పనీ చేయనీయకుండా, నలుగురిలో ఇబ్బంది పెడుతుంది తేన్పుల సమస్య. మరి దీనికి చెక్ పెట్టాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో....
చూడ్డానికి చిన్నదిలానే ఉంటుంది కానీ.. ఒక్కోసారి ఏ పనీ చేయనీయకుండా, నలుగురిలో ఇబ్బంది పెడుతుంది తేన్పుల సమస్య. మరి దీనికి చెక్ పెట్టాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఓసారి చూద్దామా...
అల్లం
జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కడుపుబ్బరం, తేన్పులను ఇది తక్షణమే నివారిస్తుంది. ఇందులో శరీరంలోని విషవాయువులను పోగొట్టే ఔషధ గుణాలు ఉండడమే దీనికి కారణం. రోజుకు రెండు లేదా మూడుసార్లు చిన్న అల్లం ముక్కను తీసుకోవడం వల్ల తేన్పుల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు. అల్లాన్ని ఇలా నేరుగా తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు తేనె లేదా పంచదారతో కలిపి తీసుకోవచ్చు.
మరో ప్రత్యామ్నాయ పద్ధతేంటంటే.. ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలను తీసుకొని నీటిలో వేసి ఓ పది నిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంతవరకు ఆగి, అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనెను కలుపుకొని తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు చేస్తే తేన్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు.
బొప్పాయి
చర్మ ఆరోగ్యానికి, అందానికి చక్కటి ఔషధంలా పనిచేయడమే కాకుండా తేన్పుల సమస్య నుంచి బయటపడేయడంలోనూ బొప్పాయి కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ, గ్యాస్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
పెరుగు
పాలల్లో కంటే పెరుగులో ఔషధ గుణాలు ఎక్కువని ఇప్పటికే చాలా పరిశోధనల్లో రుజువైంది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుంది. నిత్యం మనకు అందుబాటులో ఉండే పెరుగుతో తేన్పుల సమస్యను కూడా ఇట్టే తగ్గించుకోవచ్చు. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి, తేన్పులతో పాటు ఇతర ఉదర సంబంధిత సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. అదేవిధంగా పాలు, పాల ఉత్పత్తులు పడనివారు పెరుగును తీసుకోవడం వల్ల పాల నుంచి అందాల్సిన పోషకాలు అందుతాయి.
సోంపు గింజలు
భోజనం తర్వాత సోంపు గింజలను తీసుకోవడం చాలామందికి అలవాటే. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుందనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే తేన్పుల సమస్యను తగ్గించడంలోనూ సోంపు గింజలు ప్రభావవంతంగా పని చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఈ గింజల్లో శరీరం నుంచి విషవాయువులను పోగొట్టే లక్షణాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి, కడుపుబ్బరం, తేన్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపు గింజలను నేరుగా తీసుకోవడం మంచి పద్ధతి. ఇలా వీలుకాని వారు ఒక కప్పు నీళ్లలో బరకగా దంచుకున్న సోంపు గింజలను వేసి, కాసేపు మరగనివ్వాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత తీసుకుంటే తేన్పుల సమస్య నుంచి విముక్తి పొందచ్చు. ఇలా రోజూ రెండుసార్లు తీసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.