Published : 23/12/2022 19:10 IST

డెలివరీ తర్వాత.. ఫిట్‌గా ఉండాలంటే..

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అటు శారీరకంగా.. ఇటు మానసికంగా.. ఫిట్‌గా తయారుకావచ్చన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రసవానంతరం కూడా సరైన ఎక్సర్‌సైజ్ ప్రారంభిస్తే మళ్లీ ఫిట్‌గా తయారయ్యే అవకాశం ఉంది. ఈక్రమంలో బిడ్డ పుట్టిన తర్వాత వ్యాయామాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

వైద్య సలహా తప్పనిసరి!

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొందరు మహిళలు అవగాహనా లోపంతో వాళ్లిష్ట ప్రకారం, వాళ్లకు ఇష్టమొచ్చిన వ్యాయామాలు చేస్తుంటారు. దీనివల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ప్రసవానంతరం వ్యాయామం మొదలుపెట్టాలనుకుంటే మాత్రం.. ఎప్పుడు మొదలుపెట్టాలి? ఏయే వ్యాయామాలు చేయాలి? ఎంతసేపు చేయాలి? తదితర విషయాల్లో డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

ప్రయోజనాలు..

⚛ ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మహిళలు బరువు పెరగడం సహజం. కాబట్టి వ్యాయామం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది.

⚛ ప్రసవానంతరం శరీరంలోని అవయవాలు కాస్త బలహీనంగా, సెన్సిటివ్‌గా తయారవుతాయి. కాబట్టి బరువులెత్తడం, వేగంగా చేసే పనులు.. మొదలైనవి చేయకపోవడం మంచిది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఫిట్‌గా తయారవడానికి వాకింగ్ చేయడం మాత్రం మరచిపోవద్దు. వాకింగ్ చేసేటప్పుడు కాస్త వంగినట్లుగా కాకుండా నిటారుగా నడవాలి.

⚛ ప్రసవానంతరం చాలామంది మహిళల్లో శక్తిస్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా నీరసపడిపోతారు. మళ్లీ వారి శరీరానికి శక్తి అందాలంటే వ్యాయామం చేయడం తప్పనిసరి.

⚛ తల్లయిన తర్వాత కొందరు మహిళలు పలు రకాల కారణాల వల్ల ఒత్తిడికి గురవుతుంటారు. ఏదో తెలియని భయంతో ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారై ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అటు శారీరకంగానూ.. ఇటు మానసికంగానూ ప్రశాంతత చేకూరుతుంది.

⚛ వ్యాయామం వల్ల రాత్రుళ్లు నిద్ర బాగా పట్టే అవకాశమూ ఉంది.

⚛ ప్రసవానంతరం కొంతమంది మహిళల్లో నడుంనొప్పి, కాళ్లనొప్పులు.. వంటివి వస్తాయి. అలాంటప్పుడు వ్యాయామమే ఈ సమస్యలకు తగిన పరిష్కారం చూపుతుంది.

అయితే ముందు చెప్పుకున్నట్లుగా.. ప్రసవానంతరం వ్యాయామాలు ఎప్పుడు ప్రారంభించాలి; ఎలాంటి వ్యాయామం ఎంతసేపు చేయాలన్న విషయంలో మాత్రం వైద్యుని సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని