Tata Motors - Women Workers: ఆ కార్లు వారి చేతుల్లో
టాటా అన్ని ప్లాంట్లలో మహిళల సంఖ్య 1110. అంటే మొత్తం ఉద్యోగుల్లో మూడు శాతమే. ఇది మూడేళ్ల క్రితం మాట! ఇప్పుడు పుణెలోని ప్లాంట్ని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. సంస్థ ఎస్యూవీలు- హారియర్, సఫారీ పూర్తిగా వాళ్ల చేతులమీదే సిద్ధమవుతున్నాయి.
టాటా అన్ని ప్లాంట్లలో మహిళల సంఖ్య 1110. అంటే మొత్తం ఉద్యోగుల్లో మూడు శాతమే. ఇది మూడేళ్ల క్రితం మాట! ఇప్పుడు పుణెలోని ప్లాంట్ని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. సంస్థ ఎస్యూవీలు- హారియర్, సఫారీ పూర్తిగా వాళ్ల చేతులమీదే సిద్ధమవుతున్నాయి.
మహిళా సాధికారత అంటే వారిని బోర్డు రూములు, వైట్ కాలర్ ఉద్యోగాలకు పరిమితం చేయడమేనా? యంత్ర, మాన్యుఫాక్చరింగ్ విభాగాల్లో అవకాశమిస్తే.. అన్న ఆలోచనకు రూపమే పుణెలోని ఈ ప్లాంట్. ఒక్క పురుషుడి ప్రమేయం కూడా లేకుండా 1500 మంది మహిళలే ఈ ఎస్యూవీలను తీసుకొస్తున్నారు. వీళ్లంతా 18-25 ఏళ్ల వయసువారే! ఆలోచన 2021 జూన్లోనే వచ్చినా.. ఎన్నో ప్రయత్నాలు, అడ్డంకులు దాటుకొని పూర్తిస్థాయి ఆచరణలోకి రావడానికి ఇంత సమయం పట్టింది. 45 రోజుల కఠిన శిక్షణ తర్వాత వీళ్లంతా పూర్తిస్థాయిలో విధులు మొదలుపెట్టారు. గత ఫిబ్రవరిలో మొదటి ఎస్యూవీ విజయవంతంగా తయారవగా ఆగస్టు నుంచి పెద్ద సంఖ్యలో సిద్ధమయ్యాయి. ఈ మహిళలు మూడు షిఫ్ట్ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక షిఫ్టులో 100 వరకు వాహనాలను రూపొందిస్తున్నారు. టెస్ట్ ట్రాకింగ్ వంటివీ చూసుకుంటున్నారు. వీళ్ల పనిని సౌకర్యవంతం చేయడానికి సంస్థ నివాస సౌకర్యం, రక్షణ, ట్రాన్స్పోర్టేషన్, వైద్య సదుపాయాలూ సమకూర్చిందట.
విద్యార్థినులకు..
బలహీనులని ఆడవాళ్లకు ఆటోమొబైల్ రంగంలో అవకాశాలివ్వరు. ఆ అభిప్రాయాన్నీ మార్చాలనుకుంది టాటా సంస్థ. అందుకే కౌసల్య పేరిట ‘ఎర్న్ అండ్ లెర్న్’ అనే ప్రోగ్రామ్నీ తీసుకొచ్చింది. దీనిలో ఐటీఐ, ఇంటర్ పూర్తిచేసిన అమ్మాయిలకు మూడేళ్ల డిప్లొమా ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. వర్క్షాపుల్లో పని నేర్పుతారు. దీనికి వీరికి స్టైపెండ్ కూడా లభిస్తుంది. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగాలనూ వాళ్లే చూపిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. ‘అమ్మాయిలూ ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్లగలరు. అద్భుతాలూ సృష్టించగలరు. ఆ అవకాశమివ్వాలంతే! అదే మేం చేస్తున్నాం. వాళ్ల సత్తాకి నిదర్శనమే మా ఎస్యూవీల విజయం’ అంటున్నారు సంస్థ ప్రతినిధులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.