Published : 18/12/2022 11:56 IST

ఇరవైల్లో.. ఇలా..!

ప్రతి మనిషి జీవితంలోనూ అత్యంత ముఖ్యమైన వయసు ఏది? అంటే ఇరవైలని చెప్పుకోవచ్చు. 20-29 ఏళ్ల వయసును ఇరవైల వయసుగా పరిగణిస్తాం.. ఈ వయసులోనే జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. అమ్మాయిలకైతే ఇవి మరింత ఎక్కువని చెప్పుకోవచ్చు. చదువు, ఉద్యోగం, వివాహం.. మరికొందరికైతే పిల్లలు కూడా..! ఈ వయసు చాలా ముఖ్యమైనది. అందుకే కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఆలోచించి అడుగేయాలి.

పొదుపు తప్పనిసరి..

పుట్టుకతోనే ఎవరికీ పొదుపనేది అబ్బదు. దాన్ని క్రమంగా ప్రాక్టీస్ చేస్తూ.. అమల్లో పెడుతూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇరవైల్లోనే చాలామందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. అయితే ఇప్పటి నుంచే పొదుపెందుకులే.. ముందు కాస్త ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచనతో పొదుపును పక్కన పెట్టారా? అంతే సంగతులు.. భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా ముందు నుంచి చేస్తేనే ఎక్కువ లాభాలు పొందగలుగుతాం. ఇది పొదుపు విషయంలో బాగా వర్తిస్తుంది. అందుకే ఇరవైల్లో ఉన్నప్పుడే పొదుపు చేయడం తప్పక నేర్చుకోవాలి. దీనిపైనే ఆ తర్వాత జీవితం ఎలా ఉంటుందనే విషయం ఆధారపడి ఉంటుంది.

స్నేహాల విషయంలో..

కొత్తగా రెక్కలొచ్చేది కూడా ఇరవైల వయసులోనే. చాలామంది ఈ వయసులోనే కాలేజీలో, ఉద్యోగంలో స్థిరపడి కొత్త జీవితాన్ని చూస్తారు. దీంతో కొత్త కొత్త స్నేహాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ స్నేహాలు మనల్ని ముందుకు నడిపించేవైతే ఫర్వాలేదు. కానీ మనల్ని మనం వెళ్లే దారి నుంచి పక్కకు తోసేవైతే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. కనీసం ఒక్కరైనా మంచి స్నేహితులను చేసుకోగలగాలి. ఆ స్నేహితులు మీ గురించి.. మీ బలాలు, బలహీనతలు.. మంచిచెడ్డలు.. అన్నీ తెలిసినవారై ఉండాలి. అయినా.. మీకు ఎలాంటి ద్రోహం తలపెట్టకుండా ప్రతి అంశంలోనూ మీకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. కేవలం స్నేహితులతోనే కాదు.. కుటుంబ సభ్యులతోనూ మరింత దగ్గరగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అలాగే స్నేహితులు, లేదా పని ఒత్తిడి ఇలాంటి కారణాల వల్ల బంధువులకు దూరంగా ఉండడం కూడా మంచిది కాదు. వారితోనూ చక్కటి సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలి.

వీరికి దూరమవండి..

ప్రేమ.. ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది.. ఆ ప్రేమ మంచిదే అయితే ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఒకవేళ మీకు అవతల వ్యక్తి నుంచి సమస్యలను సృష్టిస్తోంటే మాత్రం అలాంటి బంధం నుంచి దూరంగా పోవడం మంచిది. ఇలాంటి వ్యక్తులకు దూరం జరగకుండా.. పెళ్త్లెతే వారే మారతారులే.. అన్న ఉద్దేశంతో వివాహం చేసుకుంటే మాత్రం జీవితాంతం ఇబ్బంది పడాల్సింది మీరేనని గుర్తుంచుకోండి.. అందుకే ఇలాంటి బంధాల నుంచి వీలైనంత త్వరగా దూరమవ్వాలి. అంతేకాదు.. విడిపోయిన తర్వాత వారి జ్ఞాపకాలను కూడా వీలైనంత తొందరగా మనసులోంచి తీసేసే ప్రయత్నం చేయాలి. అయితే ఇలాంటి బంధం నుంచి నేర్చుకున్న పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు.

డబ్బుతో పాటు ఆసక్తి కూడా..

చాలామందికి ఇరవైల్లో ఉన్నప్పుడు తమకు ఇష్టం ఉన్న రంగంలోకి అడుగు పెట్టాలా? లేక డబ్బు ఎక్కువగా సంపాదించగలిగే రంగంలోకి వెళ్లాలా? అన్న సందేహం వెంటాడుతూ ఉంటుంది. ఇందులో ఎక్కువమంది డబ్బుకే ఓటేస్తుంటారు. కానీ డబ్బు వస్తుంది కదా.. అని ఇప్పుడు ఆ కెరీర్ ప్రారంభించినా.. ముప్ఫైలకు చేరే సమయానికి అది మనల్ని ఇబ్బందిపెడుతుంది. ఇష్టం లేని పని చేస్తున్నామనే ఆలోచన మనల్ని ఆ పనిలో ఎదగనివ్వదు. ఎదుగుదల లేని ఉద్యోగం చేయాలనిపించక జీవితం నరకంగా మారుతుంది. అయితే డబ్బు లేకుండా కేవలం మీకు ఇష్టం అని చెప్పి మరో రంగంలోకి వెళ్తే జీవితంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ తర్వాత ఈ ఆలోచన వెర్రితనంగా తోస్తుంది. అందుకే మీకు ఇష్టముండి, ఆ రంగంలో పనిచేయాలనే తపన ఉండి.. సరిపడా డబ్బు అందించే రంగాన్ని ఎంచుకోండి. అప్పుడు జీవితాంతం హాయిగా పనిచేసేందుకు వీలుంటుంది.

వీటితో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, జీవితాన్ని ఆస్వాదించడం.. వంటివి కూడా ఈ వయసులో ముఖ్యమైనవే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి