Published : 08/02/2023 20:19 IST

పాదాలు మృదువుగా ఉండాలంటే..

చాలామందికి కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మం పొడిగా మారి పొలుసుల్లా కనిపిస్తుంటుంది. దీంతో వాటిని కవర్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇంట్లో లభ్యమయ్యే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించే కాళ్లు, పాదాల వద్ద ఉండే చర్మాన్ని తిరిగి మృదువుగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకి వెళ్లడం, రసాయనాలు అధికంగా ఉన్న సబ్బులు ఉపయోగించడం.. వంటి కారణాల వల్ల కాళ్లు, పాదాల వద్ద ఉన్న చర్మం తేమని కోల్పోయి పొడిబారినట్లుగా, పొలుసుల్లా కనిపిస్తుంది. తగినంత తేమని తిరిగి అందించడం ద్వారా ఆ చర్మాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

ఓట్‌మీల్స్‌తో..

సరిపడినన్ని ఓట్‌మీల్స్ తీసుకొని తగినంత రోజ్‌వాటర్ జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, పాదాల వద్ద పొడిచర్మం ఉన్న ప్రదేశంలో అప్త్లె చేసి కాసేపు మృదువుగా రుద్దాలి. తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. అనంతరం పొడి వస్త్రంతో తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ విధంగా రోజుకి 3 సార్ల చొప్పున 15 రోజుల నుంచి నెల రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. రోజ్‌వాటర్‌కి బదులుగా పచ్చిపాలు కూడా ఉపయోగించవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో..

బకెట్ గోరువెచ్చని నీళ్లలో అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఇందులో 15 నుంచి 20 నిమిషాల పాటు కాళ్లు, పాదాలు నానేలా ముంచి ఉంచాలి. తర్వాత కాళ్లు బయటకి తీసి చర్మం పైపొరల్లో ఉన్న మృతకణాలు పోయేలా చేతులతోనే మృదువుగా రుద్దుకోవాలి. తర్వాత శుభ్రమైన నీళ్లతో మళ్లీ కాళ్లు కడుక్కొని ఆరనివ్వాలి. అనంతరం నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్త్లె చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే చర్మం పొడిబారకుండా దీర్ఘకాలపు రక్షణ లభిస్తుంది.

పెట్రోలియం జెల్లీతో..

కాళ్లు, పాదాలు శుభ్రంగా కడుక్కొని ఆరనివ్వాలి. తర్వాత పెట్రోలియం జెల్లీ అప్త్లె చేసుకొని చర్మం లోపలి పొరల్లోకి ఇంకేలా మృదువుగా మర్దన చేసుకోవాలి. ఈ చిట్కా రోజూ రాత్రి నిద్రించే ముందు క్రమం తప్పకుండా పాటించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పెట్రోలియం జెల్లీ చర్మానికి సహజసిద్ధంగా తేమని అందించడమే కాకుండా పొడిబారిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో బాగా ఉపయోగపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని