Published : 10/02/2023 00:47 IST

చిన్న పళ్లెంలో తింటే చాలు...!

బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలే చేస్తాం. అలాగని కేవలం కసరత్తులు చేస్తేనే ఫలితం వస్తుందనుకుంటే పొరపాటు. జీవనశైలినీ, కొన్ని ఆహారపుటలవాట్లనీ కూడా మార్చుకోవాలి. అవేంటంటే... 

* ఎలా తింటారు? మన బరువు తినే విధానంపై కూడా ఆధారపడుతుందని చెబుతారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే మనం తినడం పూర్తయ్యాక సుమారు పదిహేను నిమిషాల తర్వాత కానీ ఎంత ఎక్కువ తిన్నామో తెలియదట. అందుకే, ఏది తిన్నా అమాంతం మింగేయొద్దని పెద్దలు చెబుతారు. నిదానంగా నమిలి తినగలిగితే... త్వరగా పొట్టనిండిన భావన కలుగుతుంది. ఆకలికి మించి అదనంగానూ తినాల్సిన అవసరం రాదు. పైగా ఇలా తింటే ఆహారమూ తేలిగ్గానూ జీర్ణమవుతుంది.

* ఒకేసారి పళ్లెం నిండుగా ఆహార పదార్థాలు నింపుకొని తింటుంటారు చాలామంది. దీనివల్ల ఎంత తింటున్నామో నియంత్రణ ఉండదు. ఎందుకంటే, కొన్నిసార్లు కడుపు నిండినా కళ్లు మాత్రం ఇంకా కావాలని కోరుకుంటాయి. అందుకే కాస్త చిన్న పళ్లాన్ని తినడానికి ఎంచుకోండి. అందులోనే గుడ్లూ, చేపలూ, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వంటివన్నీ కలిసిన సమతులాహారాన్ని వడ్డించుకోండి. అలానే ఒకేసారి పెద్ద మొత్తంలో తినకుండా... కొద్దికొద్దిగా నాలుగైదు సార్లు ఫుడ్‌ తీసుకోగలిగితే శరీరంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. పోషకాలూ శరీరానికి తగినంతగా అందుతాయి.

* దాహమేస్తే... కూల్‌డ్రింక్‌ తాగే అలవాటు మీకుందా? అయితే, మానేయండి. అవి మీకు ఎటువంటి మేలూ చేయకపోగా...మితిమీరి తాగితే ఎముకల్ని గుల్లబరుస్తాయి. అలానే, చల్లచల్లగా గొంతులోకి దిగే పళ్లరసాలనూ పక్కనపెట్టేయండి. ఒకవేళ తాగినా ఐసు, పంచదార వంటివి లేకుండా చూసుకోండి. అచ్చంగా పండ్లనే తినండి. అప్పుడే అందులోని  పీచు జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని