స్నేహ బంధానికి టెక్నాలజీ వేదికైతే..!

ఎవరి జీవితంలోనైనా మరపురాని బంధమంటే.. అది స్నేహమే..! స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపే క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ మధుర క్షణాలే. అయితే గతంలో ఎప్పుడో ఒకసారి స్నేహితులను కలిసి ఆనంద భరిత క్షణాలను ఆస్వాదించిన వారంతా ఇప్పుడు టెక్నాలజీ మహిమతో ఎప్పుడూ కలిసే ఉంటున్నారు. అటు అమెరికా నుంచి ఇటు అనకాపల్లి వరకు ప్రపంచంలో ఏ మూలనున్న స్నేహితులైనా డిజిటల్‌గా మీట్ అవుతున్నారు.

Updated : 13 May 2022 15:53 IST

ఎవరి జీవితంలోనైనా మరపురాని బంధమంటే.. అది స్నేహమే..! స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపే క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ మధుర క్షణాలే. అయితే గతంలో ఎప్పుడో ఒకసారి స్నేహితులను కలిసి ఆనంద భరిత క్షణాలను ఆస్వాదించిన వారంతా ఇప్పుడు టెక్నాలజీ మహిమతో ఎప్పుడూ కలిసే ఉంటున్నారు. అటు అమెరికా నుంచి ఇటు అనకాపల్లి వరకు ప్రపంచంలో ఏ మూలనున్న స్నేహితులైనా డిజిటల్‌గా మీట్ అవుతున్నారు. దూరాన్ని దగ్గర చేసుకుంటున్నారు. ప్రత్యేకించి ఈ కరోనా వేళ డిజిటల్ వేదికలు పోషిస్తున్న పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో స్నేహాలను పెంపొందించేందుకు ఈ-వేదికలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం రండి..

మాట్లాడడం సులువైంది!

ఇంతకుముందు ఎవరైనా స్నేహితులతో మాట్లాడాలంటే ఫోన్ చేసి మాట్లాడేవాళ్లం. అంతకుముందైతే కేవలం ఉత్తరాలు, లేదా కలుసుకొని మాట్లాడుకోవడమే.. మరి ఇప్పుడో.. సోషల్ మీడియా ద్వారా ఇరవై నాలుగ్గంటలు దగ్గరగానే ఉండచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. దీంతో ఎప్పుడూ స్నేహితులకు అందుబాటులోనే ఉండే అవకాశం లభించింది.

బృందంగానూ కలుసుకోవచ్చు..!

స్నేహితులంటే కేవలం ఒకరిద్దరు కాదు.. అంతా కలిస్తేనే ఆనందం. అందరూ కలిసి సరదాగా గడిపే రోజుల్ని మిస్సవ్వని వ్యక్తులు ఉండరంటే నమ్మండి. అలాంటి మీటింగులు కూడా టెక్నాలజీ వచ్చిన తర్వాత సులువైంది. వివిధ దేశాల్లో ఉన్న స్నేహితులంతా కలిసి ఏక కాలంలో మాట్లాడే వీలు ప్రస్తుతం టెక్నాలజీ కల్పిస్తోంది. దీని ద్వారా అందరూ వర్చువల్ గానే కలుసుకున్నా.. ఇంతకుముందు తాము కలిసి ఉన్నప్పుడు చేసిన అల్లరికి ఇదేమీ తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు.. 
స్నేహితుల జీవితంలో చోటుచేసుకునే అపురూప ఘట్టాల్లోనూ పాలుపంచుకునే అవకాశం టెక్నాలజీ ద్వారా లభిస్తోంది. జూమ్, గూగుల్ మీట్ లాంటి వేదికల ద్వారా దగ్గర లేకపోయినా నిజంగా కలుసుకున్న భావనను సొంతం చేసుకునే అవకాశం కలుగుతోంది.

జాగ్రత్తలూ అవసరమే!

టెక్నాలజీ ఎంతగా మన బంధాలను పెనవేయడానికి ఉపయోగపడినా.. దాన్ని వినియోగించడంలో జాగ్రత్త వహించడం మంచిది. టెక్నాలజీ వల్ల ఎప్పుడో పరిచయమైన స్నేహితులతోనూ టచ్‌లో ఉండొచ్చు. అయితే మన స్నేహితులెవరైనా బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నేరుగా వచ్చి పరామర్శించడానికి, టెక్నాలజీ ద్వారా పరామర్శించడానికి తేడా ఉంటుంది. అలాగే మనసు పొరల్లో గూడు కట్టుకున్న భావాలను వ్యక్తీకరించడానికి టెక్నాలజీ పూర్తిగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే మరీ సాధ్యం కాని పరిస్థితుల్లో ఈ మాధ్యమాలను ఉపయోగించినప్పటికీ, వీలు కుదిరినప్పుడు మాత్రం స్నేహితులను నేరుగా కలవడం, మాట్లాడడం.. వంటివి చేయాలి.

ఇలాంటి వాటికి స్నేహితుల దినోత్సవం వంటి వేడుకలు చక్కటి వేదికలవుతాయి. ఇలాంటి సందర్భాల్లో స్నేహితులంతా ఒకసారి కలుసుకుంటే అది వచ్చే సంవత్సరం లేదా మళ్లీ కలుసుకునే వరకూ మీ బంధానికి వూపిరి పోస్తుంది. అయితే ఇలా వ్యక్తిగతంగా కలిసే సందర్భాలలో కరోనా జాగ్రత్తలు మాత్రం మర్చిపోరు కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్