ఏడాది లోపు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వచ్చు?

పిల్లలు ఆరు నెలల దాకా తల్లి పాల మీదే పూర్తిగా ఆధారపడతారు. ఆరో నెలలో అన్నప్రాసనతో వారికి ఘనాహారం అందించడం మొదలుపెడతారు తల్లులు. అయితే ఈ క్రమంలో చిన్నారులకు ఏది పెట్టాలి? ఏది పెట్టకూడదు? అన్న విషయాల్లో అమ్మల్లో బోలెడన్ని సందేహాలుంటాయి. ఘనాహారం పెడితే మింగడానికి ఇబ్బంది పడతారేమో అని కొందరు, మాంసం-గుడ్లు పెడితే ఏమవుతుందోనని మరికొందరు, ఏ పండ్లు తినిపించచ్చో అని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కో సందేహం ఉంటుంది.

Updated : 28 Jun 2021 19:31 IST

పిల్లలు ఆరు నెలల దాకా తల్లి పాల మీదే పూర్తిగా ఆధారపడతారు. ఆరో నెలలో అన్నప్రాసనతో వారికి ఘనాహారం అందించడం మొదలుపెడతారు తల్లులు. అయితే ఈ క్రమంలో చిన్నారులకు ఏది పెట్టాలి? ఏది పెట్టకూడదు? అన్న విషయాల్లో అమ్మల్లో బోలెడన్ని సందేహాలుంటాయి. ఘనాహారం పెడితే మింగడానికి ఇబ్బంది పడతారేమో అని కొందరు, మాంసం-గుడ్లు పెడితే ఏమవుతుందోనని మరికొందరు, ఏ పండ్లు తినిపించచ్చో అని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కో సందేహం ఉంటుంది. అయితే తేనె వంటి కొన్ని పదార్థాలు మినహాయిస్తే ఏడాదిలోపు పిల్లలకు ఎలాంటి ఘనాహారమైనా తినిపించచ్చని చెబుతోంది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ). ఎందుకంటే ఈ వయసులో మనం అందించే పోషకాహారం వారి ఎదుగుదలకు చక్కగా దోహదం చేస్తుందని చెబుతోంది. మరి, ఘనాహారం అలవాటు చేసే క్రమంలో ఏడాది లోపు చిన్నారులకు ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టాలి? ఈ క్రమంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

అప్పటిదాకా పాలు తాగిన పిల్లలకు ఒక్కసారి ఘనాహారం పెడితే వారు మింగలేరు. అందుకే మనం ఏది అలవాటు చేసినా స్మూతీలా తయారుచేసి అందిస్తే వారు సులభంగా మింగగలుగుతారు. అలాగే దీంతో పాటు నిర్ణీత సమయాల్లో తల్లి పాలు పట్టడం తప్పనిసరి అని చెబుతోంది సీడీసీ.

ఇవి పెట్టచ్చు!

* చిన్నారులకు ఘనాహారం అలవాటు చేసే క్రమంలో గుడ్డులోని పచ్చసొన మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇందులోని ఐరన్ పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తుందట!

* ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం.. వంటి ఖనిజాలు నిండి ఉన్న అరటిపండు పిల్లలు మింగడానికి సులభంగా ఉంటుంది. అంతేకాదు.. ఏడాదిలోపు చిన్నారుల్లో కొంతమంది మలబద్ధకంతో బాధపడుతుంటారు. ఆ సమస్యను తగ్గించడంలో అరటిపండు చక్కగా పని చేస్తుంది.

* పప్పులు, కాయధాన్యాలు.. వంటివి పసిపిల్లలకు పెడితే వారికి కడుపునొప్పి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, అజీర్తి.. వంటి సమస్యలొస్తాయని కొందరు తల్లులు భయపడుతుంటారు. నిజానికి ఇందులోని ప్రొటీన్‌ పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు సహాయపడుతుంది. కాబట్టి రోజూ కొద్ది మొత్తాల్లో వీటిని ఉడికించి.. ఉగ్గులా చేసి తినిపించడం లేదంటే పప్పులన్నీ కలిపి పొడిలా చేసి దాన్ని ఉగ్గులా ఉడికించి తినిపించడం మంచిది.

* చిన్నపిల్లలకు పల్లీలు పెడితే అలర్జీలొస్తాయని భయపడుతుంటారు కొందరు తల్లులు. అయితే పిల్లలకు ఘనాహారం అలవాటు చేసే క్రమంలోనే వారికి ఇంట్లో తయారుచేసిన పీనట్‌ బటర్‌ అందివ్వడం; లేదంటే వేయించి పొడి చేసిన పల్లీలను వారికి పెట్టే పదార్థాల్లో కలపడం వల్ల ఈ సమస్య రాకుండా జాగ్రత్తపడచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే పల్లీలను వేటివేటితో కలపొచ్చు అన్న విషయం పిల్లల వైద్య నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.

* యాపిల్స్‌, క్యారట్స్‌, బీట్‌రూట్‌.. ఇలా కాస్త గట్టిగా ఉన్న పదార్థాలను మెత్తగా ఉడికించి, ఆ నీటితోనే ప్యూరీలా చేసి పిల్లలకు అందించడం వల్ల అందులోని పోషకాలు వారి శరీరానికి అందుతాయి.

* పిల్లలకు తినిపించే మాంసాహారంలో అధిక కొవ్వులు, చర్మం, బోన్స్‌.. వంటివి తొలగిస్తే అవి సులభంగా ఉడకడంతో పాటు వాటిని మెత్తగా చేసి తినిపించడం సులభమవుతుంది.

* మెత్తగా ఉడికించే అన్నం లేదా ఉగ్గులో ఆకుకూరలు, బంగాళాదుంపల్ని భాగం చేయచ్చు.

* అలాగే ఆరు నెలల తర్వాత పిల్లలకు నీళ్లు తాగించడం కూడా అలవాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మరీ ఎక్కువగా కాకుండా అరకప్పు లేదా ముప్పావు కప్పు నీటిని నిర్ణీత సమయాల్లో, ఘనాహారం పెట్టినప్పుడు తాగించాల్సి ఉంటుంది.

వీటి జోలికెళ్లొద్దు!

* ఏడాదిలోపు పిల్లలకు తేనె అసలే పెట్టద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది వారిలో బొట్యులిజం అనే ప్రమాదకర వ్యాధికి దారితీస్తుందట. తద్వారా చిన్నారుల్లో చూపు మందగించడం, అలసట, నీరసం.. వంటి సమస్యలు తలెత్తుతాయట!

* పాశ్చరైజేషన్‌ చేయని పాలు, జ్యూసులు, పెరుగు.. వంటివి పిల్లల్లో ఈ.కొలి బ్యాక్టీరియాకు కారణమవుతాయట. తద్వారా విపరీతమైన విరేచనాలు కావడం, నెమ్మదిగా వారు బరువు తగ్గడం.. వంటివి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి నిపుణుల సలహా మేరకు బాగా మరిగించిన పాలు, పండ్లను బాగా ఉడికించి తయారుచేసిన జ్యూసులు/స్మూతీస్‌.. వంటివి మాత్రమే పిల్లలకు అందించడం మంచిది.

* చిన్నారులకు రుచిస్తాయన్న ఉద్దేశంతో క్యాండీస్‌, కేక్స్‌, కుకీస్‌, ఐస్‌క్రీమ్స్‌.. వంటివి తెగ పెడుతుంటారు కొంతమంది. అయితే చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే ఇలాంటి పదార్థాలు వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావంటున్నారు నిపుణులు.

* అలాగే మీరు తయారుచేసే పదార్థాల్లో ఎక్కువ ఉప్పు వాడడం, ఉప్పు అధికంగా ఉండే చిప్స్‌, బిస్కట్లు.. వంటివి వారికి అందించకపోవడమే శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు.

అయితే ఘనాహారం అలవాటు చేసే క్రమంలో మీరు పిల్లలకు పెట్టే ఏ ఆహారమైనా సరే.. ముందుగా అది వారి శరీరానికి సరిపడుతుందో, లేదో ఒక్కసారి పరిశీలించడం మంచిది. ఇందుకోసం కొద్ది మొత్తాల్లో వారికి అందించి చూడండి. ఈ క్రమంలో పిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకోవచ్చు. తద్వారా వారిలో అలర్జీ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే ఇంకా మీరు వారికి పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి సందేహాలున్నా సంబంధిత నిపుణుల సలహా తీసుకొని వారిచ్చిన న్యూట్రిషన్‌ ఛార్ట్‌ ఫాలో అయితే మీ చిన్నారికి చక్కటి పోషకాహారం అందించిన వారవుతారు. అది వారి ఎదుగుదలకు ఎంతో అవసరం కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్