ఇండోనేషియా స్టేడియంలో తొక్కిసలాట.. గంటగంటకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

ఇండోనేషియా ఫుట్‌బాల్‌ మైదానంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 174కు పెరిగింది.

Updated : 02 Oct 2022 15:26 IST

జకర్తా: ఇండోనేషియాలో (Indonesia) ఫుట్‌బాల్‌ మైదానంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఘటన చోటుచేసుకన్న అనంతరం 127 మంది చనిపోయారని ప్రకటించగా..  ఆదివారం మధ్యాహ్నానికి ఈ సంఖ్య 174కు చేరింది. మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో (Soccer Match) ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 100 మందికిపైగా ఐసీయూల్లో చికిత్స పొందుతుండగా.. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రపంచంవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైనదిగా భావిస్తున్నారు.

ఫుట్‌బాల్ మ్యాచ్‌లో (Soccer Match) పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ ప్రయోగించడంతోపాటు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అయితే, స్టేడియంలో ఎటువంటి అల్లర్లు జరగలేదని.. పోలీసులు ఎందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారో తెలియదని కొందరు ప్రేక్షకులు పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలు ఉన్నారనే విషయాన్ని చూడకుండా భద్రతా సిబ్బంది దారుణంగా వ్యవహరించారని వాపోయారు.

స్టేడియం మొత్తం సామర్థ్యం 42వేలు కాగా.. టికెట్లన్నీ అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో దాదాపు మూడువేల మంది మైదానంలోనికి చొచ్చుకువచ్చారని.. వారిని అదుపు చేసేందుకే టియర్‌ గ్యాస్‌ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం స్టేడియం బయట ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 13 వాహనాలకు నిప్పు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకూ ఎలాంటి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించవద్దని ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌కు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని