Pakistan: పాకిస్థాన్‌లో ఇద్దరు సిక్కుల హత్య.. మైనారిటీలే లక్ష్యంగా దాడులన్న భారత్‌

పాకిస్థాన్‌లో మైనారిటీలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు రాజధాని పెషావర్‌కు సమీపంలో ఇద్దరు సిక్కు పౌరులను దుండగులు కాల్చి చంపారు.

Published : 16 May 2022 01:52 IST

ఉగ్రవాద చర్యగా పేర్కొన్న పాక్‌ ప్రభుత్వం

పెషావర్‌: పాకిస్థాన్‌లో మైనారిటీలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు రాజధాని పెషావర్‌కు సమీపంలో ఇద్దరు సిక్కు పౌరులను దుండగులు కాల్చి చంపారు. సర్బాంద్‌ పట్టణంలోని బాబా తాల్ బజార్‌లో దుకాణం నిర్వహిస్తోన్న సల్జీత్‌ సింగ్‌(42), రంజీత్‌ సింగ్‌ (38) లపై దుండగులు కాల్పులు జరపడంతో వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు బైకుపై పారిపోయారు. అయితే, ఈ దాడులకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ ఉగ్రచర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీస్‌ సూపరింటెండెంట్‌ అకిక్‌ హుస్సేన్‌ మీడియాకు వెల్లడించారు.

ఖండించిన పాక్‌ ప్రధాని..

ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరిగిన ఈ దాడిని పాక్‌ ప్రధాని హెషబాజ్‌ షరీఫ్‌ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడంతోపాటు వారికి శిక్షపడేలా చూడాలని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమ్మూద్‌ ఖాన్‌ను ఆదేశించారు. ముస్లిమేతర పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న ఆయన ఉగ్రచర్యలను సహించేది లేదన్నారు. మరోవైపు మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రభుత్వం విఫలమైందని పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే నివేదిక అందించాలని ప్రావిన్సు చీఫ్‌ సెక్రటరీతోపాటు ఐజీపీలను ఆదేశించారు. ఇక సిక్కలపై దాడి ఘటనపై స్పందించిన పాకిస్థాన్‌ విదేశీ వ్వవహారాల శాఖ మంత్రి బిలావల్‌ భుట్టో.. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.

భారత్‌ నిరసన..

పాకిస్థాన్‌లో మైనారిటీలపై జరిగిన దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఘోరమైన, దుర్భరమైన దాడిగా పేర్కొన్న భారత్‌.. వరుసగా జరుగుతోన్న దారుణాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా మైనారిటీ వర్గాలను లక్ష్యంగానే ఈ దాడులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, పెషావర్‌లో దాదాపు 15వేల సిక్కులు నివాసం ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా వ్యాపారం, ఫార్మసీలను నిర్వహించేవారే. అయితే, గతంలోనూ ఇక్కడ మైనార్టీలపై దాడులు జరిగాయి. యునాని వైద్యుడిగా ఉన్న ఓ సిక్కు మతస్థుడిని గతేడాది సెప్టెంబరులో దుండగులు కాల్చిచంపారు. 2018లోనూ చరణ్‌జిత్‌ సింగ్‌ అనే వ్యక్తి పెషావర్‌లో హత్యకు గురయ్యాడు. ఇక 2020లో వార్తాఛానల్‌ యాంకర్‌ రవిందర్‌ సింగ్‌ కూడా దుండగుల దాడిలో చనిపోయాడు. 2016లోనూ పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న సోరెన్‌ సింగ్‌ను కాల్చిచంపారు. 2017 గణాంకాల ప్రకారం, పాకిస్థాన్‌లో మైనారిటీలుగా ఉన్న వారిలో హిందువులే ఎక్కువ. రెండో వరుసలో క్రిస్టియన్‌లు ఉండగా, సిక్కులు, పార్సీలు ఇతర మైనారిటీలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని