Pakistan: ఘోర ప్రమాదంలో 20మంది సజీవ దహనం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు.........

Published : 16 Aug 2022 16:28 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌, బస్సు ఢీకొన్న ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రం ముల్తాన్‌లో జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పాకిస్థాన్ ​రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి ఈ దర్ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు.

ప్రయాణికులతో లాహోర్​ నుంచి కరాచీకి హైవేపై వెళ్తున్న బస్సు, ఆయిల్​ ట్యాంకర్​ ఢీకొన్నాయి. ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హాహాకారాలు చేస్తూనే మంటల్లో కాలిపోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అతికష్టం మీద ఆర్పగా.. ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, డీఎన్ఏ పరీక్షల ఆధారంగానే వారిని నిర్ధారించాల్సి ఉంటుందని అధికారి వెల్లడించారు.

ఈ ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతులను గుర్తించి, మృతదేహాలు వారి కుటుంబసభ్యులకు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పాకిస్థాన్‌లో శనివారం సైతం ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 13మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని