Crime News: కాల్‌ సెంటర్‌లో దారుణం.. ఉద్యోగం మానేస్తున్నారని 8 మంది హత్య!

ఓ కాల్‌సెంటర్‌లో (Call Center) పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులు తమ జాబ్‌ మానేసేందుకు సిద్ధమైన క్రమంలో హత్యకు గురైన ఘటన మెక్సికోలో (Mexico) చోటుచేసుకుంది.

Published : 07 Jun 2023 14:10 IST

మెక్సికో సిటీ: మెక్సికోలో (Mexico) దారుణం చోటుచేసుకుంది. కాల్‌సెంటర్‌లో (Call Center) ఉద్యోగం మానేసేందుకు సిద్ధమైన ఎనిమిది మంది యువతీ, యువకులను చంపిన ఘటన కలకలం రేపుతోంది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు (Real Estate Scam) పాల్పడుతున్న మెక్సిన్‌లోని ఓ డ్రగ్‌ కార్టెల్‌లో (Drug cartel) జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని అమెరికా, మెక్సికో అధికారులు ధ్రువీకరించారు.

మెక్సికోలోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్‌ కార్టెల్‌ ఆధ్వర్యంలో ఆ కాల్‌సెంటర్‌ నడుస్తోంది. మెక్సిలోనే అత్యంత హింసాత్మక ముఠాగా జలిసోకు పేరుంది. అయితే, అందులో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కనిపించకుండా పోయారు. మే 20-22 మధ్యకాలంలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళల జాడ కనిపించలేదు. వారంతా 30ఏళ్లలోపు వారే. దీంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్‌ కవర్లు ఆ ప్రాంతంలో బయటపడ్డాయి. వీటికి ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించగా.. అవన్నీ తప్పిపోయిన ఆ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులవేనని తేలింది.

మెక్సికోలో అత్యంత హింసాత్మక గ్యాంగ్‌గా పేరున్న ఈ జలిసో కొత్త తరం ముఠా.. సాధారణ కార్యకలాపాలు కాకుండా డ్రగ్స్‌ అక్రమరవాణా, దోపిడీ, కిడ్నాప్‌ల వంటి వాటికి పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల పేరిట అమెరికన్లు, కెనడియన్లే లక్ష్యంగా ఈ కాల్‌సెంటర్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. అయితే, అందులో పనిచేసే యువతీ, యువకుల దారుణ హత్యలకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. వారంతా ఉద్యోగం మానేసేందుకు ప్రయత్నిస్తున్నందునే ఈ దారుణాలకు తెగబడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ ఉద్యోగుల కుటుంబీకులు మాత్రం తమ పిల్లలు సాధారణ కాల్‌సెంటర్‌లోనే పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని దర్యాప్తు సంస్థలకు వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు