Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!

బంగ్లాదేశ్‌లో పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పద్మా వంతెన’ను ప్రధాని షేక్‌ హసీనా శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు కలిగి ఉన్న ఈ మల్టీపర్పస్‌ వంతెన...

Published : 26 Jun 2022 01:54 IST

ఢాకా: బంగ్లాదేశ్‌లో పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పద్మా వంతెన’ను ప్రధాని షేక్‌ హసీనా శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు కలిగి ఉన్న ఈ మల్టీపర్పస్‌ వంతెన.. దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జ్‌ కావడం విశేషం. రాజధాని నగరం ఢాకా.. ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మోంగ్లా ఓడరేవు మధ్య దూరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అదే విధంగా.. దేశంలో వెనుకబడిన నైరుతి ప్రాంతాన్ని ఢాకాతోపాటు మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తుంది.

‘ఈ వంతెన కేవలం ఇటుకలు, సిమెంట్, స్టీల్‌, కాంక్రీట్‌ కలగలిపిన నిర్మాణం మాత్రమే కాదు.. మన శక్తిసామర్థ్యాలు, గౌరవానికి చిహ్నం. ఈ వంతెన బంగ్లాదేశ్ ప్రజలది’ అని ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభోత్సవం సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘ఈ వంతెన ప్రారంభంతో బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల ప్రజల కల సాకారమైంది. ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన విషయంలో షేక్ హసీనా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇది సాధ్యపడింది’ అధికార వర్గాలు ఓ వార్తాసంస్థకు తెలిపాయి. మరోవైపు, ఈ వంతెన అందుబాటులోకి రావడంపై భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అభినందనలు తెలిపింది.

వంతెన విశేషాలు..

* ప్రధాన వంతెన పొడవు మొత్తం 6.15 కిలోమీటర్లు. ఇందులో రైల్వే వయాడక్ట్ పొడవు 532 మీటర్లు కాగా, నాలుగు లేన్ల రోడ్డు వయాడక్ట్‌ పొడవు 3.14 కి.మీ.

* దీనికి దాదాపు 3.6 బిలియన్‌ డాలర్ల వ్యయమైంది. అవినీతి ఆరోపణలతో ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు నిరాకరించగా.. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించారు.

* 2015లో ప్రారంభమై 2022 జూన్‌ నాటికి పూర్తయిన ఈ వంతెన.. వెనుకబడిన ప్రాంతమైన నైరుతి బంగ్లాదేశ్‌లోని 19 జిల్లాలను.. ఢాకాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది.

ఈ వంతెన భారత్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాల మధ్య ప్రయాణ సమయాన్నీ దాదాపు సగం వరకు తగ్గిస్తుంది.

చైనాకు చెందిన రైల్వే మేజర్ బ్రిడ్జ్ ఇంజినీరింగ్ గ్రూప్‌ ఈ బ్రిడ్జ్‌ను నిర్మించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ వంతెనను నిర్మించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, బంగ్లాదేశ్ వాటిని కొట్టిపారేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని