Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి

ఇజ్రాయెల్‌లోని జెరూసలెం రెస్టారంట్‌లో రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ 22ఏళ్ల పాటు కోమాలోనే ఉండి తాజాగా ప్రాణాలు విడిచారు.

Published : 02 Jun 2023 01:45 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌లోని జెరూసలెం రెస్టారంట్‌లో రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడిలో పదిహేను మంది మృతిచెందగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే, 2001లో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ 22ఏళ్ల పాటు కోమాలోనే ఉండిపోయింది. తాజాగా ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఇజ్రాయెల్‌లో ఓ ఆస్పత్రి వెల్లడించింది. దీంతో ఆ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరుకుంది.

జెరూసలెంలోని ఓ రెస్టారంట్‌లో 2001 ఆగస్టు 9న ఆత్మాహుతి దాడి జరిగింది. పాలస్తీనాకు చెందిన ఓ మిలిటెంట్‌ అక్కడి పిట్జా రెస్టారంట్‌లోకి వెళ్లి తనను తాను పేల్చుకొన్నాడు. ఆ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులుగా మిగిలిపోయారు. అదే సమయంలో హనా నాషెన్‌బెర్గ్‌ అనే 31ఏళ్ల మహిళ.. తన మూడేళ్ల చిన్నారితో కలిసి ఆ రెస్టారంట్‌లో భోజనం చేస్తున్నారు. ఆ ఆత్మాహుతి దాడిలో హనాకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లిపోయారు. కానీ, ఆ చిన్నారికి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా 22ఏళ్ల పాటు కోమాలోనే ఉండిపోయిన హనా.. తాజాగా ప్రాణాలు విడిచారు.

ఆ ఘటనలో ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తికి సహకరించినందుకు గాను అలాం తమేమి అనే మహిళకు శిక్ష పడింది. ఆమెకు 16 జీవిత ఖైదుల పడ్డాయి. అయితే, 2011లో హమాస్‌ మిలిటెంట్‌ సంస్థతో జరిగిన ఖైదీల మార్పిడిలో భాగంగా ఆమెను విడుదల చేశారు. అనంతరం ఆమెను జోర్డాన్‌కు పంపించారు. భారీ వినాశనానికి కుట్ర పన్నారని ఆమెపై అమెరికా ఆమెపై అభియోగాలు మోపింది. ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితాలోనూ చేర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని