Covid-19: నిన్న చైనా, నేడు దక్షిణ కొరియా.. మళ్లీ భయకంపితుల్ని చేస్తున్న కరోనా

దక్షిణ కొరియానూ కరోనా వైరస్‌ వణికిస్తోంది. బుధవారం ఏకంగా 4లక్షలకు పైగా కేసులు కేసులు వెలుగుచూశాయి......

Published : 17 Mar 2022 01:16 IST

ఓకేరోజు 4లక్షలకు పైగా కేసులు

సియోల్‌: తగ్గినట్లే తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తున్నట్లే కనిపిస్తోంది. కొవిడ్‌ పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాలో ఎప్పుడూ లేనన్ని కొత్త కేసులు నమోదవుతుండగా.. దక్షిణ కొరియానూ వైరస్‌ వణికిస్తోంది. బుధవారం అక్కడ రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. ఏకంగా 4లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. దక్షిణ కొరియా ప్రభుత్వ మీడియా వివరాల ప్రకారం.. బుధవారం 4,00,714 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ దేశంలో ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 76,29,275కు చేరినట్లు కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ ఏజెన్సీ (KDCA) స్పష్టం చేసింది.

‘స్టెల్త్‌ ఒమిక్రాన్‌’ రూపంలో కొవిడ్‌ మహమ్మారి చైనాను మళ్లీ వణికిస్తోంది. రెండేళ్ల తర్వాత తొలిసారి.. చైనాలో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందురోజు కంటే కేసులు రెట్టింపయ్యాయి. కొత్త కేసు ఒక్కటీ రాకూడదన్న(జీరో-టాలరెన్స్‌) వ్యూహంతో.. రెండేళ్లకు పైగా కొవిడ్‌ను కట్టడి చేస్తూ వస్తోన్న డ్రాగన్‌కు ఈ వేరియంట్‌ దడ పుట్టిస్తోంది. వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాలను మూసివేసింది. 3 కోట్ల మందికి పైగా ప్రజలను ‘లాక్‌డౌన్‌’లో ఉంచింది. ప్రజారవాణాను నిలిపివేసింది. పలు నగరాల్లో ఆంక్షలు విధించింది.

మళ్లీ వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తర్వాత వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఎపిడెమిలాజిస్ట్‌ మరియా వాన్‌ ఖెర్ఖోవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా అప్రమత్తంగా ఉండాలని.. టెస్టులు, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని