USA: మాకు భారత్‌, పాక్‌ రెండూ ముఖ్యమైన దేశాలే..!

పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధవిమానాలకు అవసరమైన కీలక పరికరాలను అమెరికా సరఫరా చేయడంపై ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై బైడెన్‌ కార్యవర్గం స్పందించింది. అమెరికా

Updated : 27 Sep 2022 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధవిమానాలకు అవసరమైన కీలక పరికరాలను అమెరికా సరఫరా చేయడంపై ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై బైడెన్‌ కార్యవర్గం స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మాట్లాడుతూ ‘‘మేము భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాల్లో.. ఒకదానిని దృష్టిలో పెట్టుకొని మరొకదానిని చూడం. వేర్వేరు అంశాల ఆధారంగా మాకు రెండూ వేటికవే ముఖ్యమైన భాగస్వాములు. మేము వారితో పరస్పర అంశాల్లో కలిసి పనిచేశాం. మా బంధంలో పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి. భారత్‌తో మా బంధం దానికదే ప్రత్యేకం. ఈ రెండు దేశాలు పరస్పరం నిర్మాణాత్మక సంబంధాలు పెంపొందించుకొనేలా చేయగలిగినంత చేస్తామనే విషయాన్ని గట్టిగా చెప్పాలనుకొంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

అఫ్గాన్‌ ప్రజలకు మద్దతు అంశంపై తాము నిత్యం పాకిస్థాన్‌తో చర్చిస్తామని నెడ్‌ ప్రైస్‌ వెల్లడించారు. ‘‘అఫ్గాన్‌ ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, దయనీయ పరిస్థితులను మెరుగు పర్చడం, తాలిబన్లు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొంటున్నారా అనే అంశాలను పరిశీలించడం కోసం పాక్‌తో మాట్లాడతాం’’ అని ఆయన వెల్లడించారు. తాలిబన్లు ఇచ్చిన మాటపై నిలబడకపోతే ఆ ప్రభావం పాకిస్థాన్‌పై కూడా ఉంటుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు వరద సాయం కింద మిలియన్ల డాలర్లను అందజేశామన్నారు. అదనపు సాయం వివరాలను మరోసారి ప్రకటిస్తామన్నారు.

అంతకుముందు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరు కోసం పాక్‌కు ఎఫ్‌-16 విమానాల విడిభాగాలను అమెరికా సరఫరా చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విమానాలను ఎవరికి వ్యతిరేకంగా వాడతారో అందరికీ తెలుసన్నారు. ‘‘మీరు ఇలాంటి మాటలతో ఎవరినీ మూర్ఖులను చేయలేరు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని