Bangla Fuel Crisis: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న పెట్రోల్‌ ధరలు.. ఒకేసారి 52శాతం పెరుగుదల

పొరుగు దేశం బంగ్లాదేశ్‌ (Bangladesh) కూడా శ్రీలంక మాదిరి పరిస్థితి (Sri Lanka Crisis) ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.

Published : 09 Aug 2022 01:38 IST

శ్రీలంక తరహాలో నిరసనల వెల్లువ

ఢాకా: పొరుగు దేశం బంగ్లాదేశ్‌ (Bangladesh) కూడా శ్రీలంక మాదిరి పరిస్థితి (Sri Lanka Crisis) ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అక్కడ ఇంధన ధరలు ఒక్కసారిగా 52శాతం మేర పెరిగాయి. ఆ దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ స్థాయిలో ఎన్నడూ ఇంధన ధరలు పెరగలేదని అక్కడి మీడియా పేర్కొంది. ఇలా భారీ స్థాయిలో ధరలను పెంచడంతో షేక్‌ హసీనా ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.

పెట్రోల్‌ ధర (Petrol Price) లీటరుకు ఒకేసారి 51.2శాతం అనగా 44 టాకాలు (బంగ్లాదేశీ కరెన్సీ) పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీంతో లీటరు పెట్రోల్‌ ధర 130 టాకాలకు పెరిగింది. దీనితోపాటు లీటరు డీజిల్‌పై (Diesel Price) 34 టాకాలు, ఆక్టేన్‌పై (Octane) 46 టాకాలు పెంచింది. పెట్రోల్‌, డీజిల్‌పై యాభై శాతం పెరగగా.. కిరోసిన్‌ ధర కూడా 42శాతం పెరిగింది. ఇలా ఇంధన ధరలను ఒకేసారి భారీ స్థాయిలో పెంచడంపై బంగ్లాదేశ్‌ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బస్సు ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు ఆపరేటర్లు ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఆందోళనలు మొదలుపెట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, వీటిపై స్పందించిన ప్రభుత్వం.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంధన ధరలను పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది.

ఇదిలాఉంటే, 416 బిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ కలిగిన బంగ్లాదేశ్‌ (Bangladesh).. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. అయితే, గత కొంతకాలంగా ప్రపంచ పరిస్థితులు మారడంతో బంగ్లాదేశ్‌ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఇంధన, ఆహార ధరలు పెరగడం, వాటిని దిగుమతి చేసుకునేందుకు భారీ ఖర్చుచేయడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో ఐఎంఎఫ్‌తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం బంగ్లాదేశ్‌ ప్రయత్నాలు చేస్తోంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని