US: అమెరికా మధ్యంతర ఎన్నికలు.. ‘ప్రతినిధుల సభ’లోనే తీవ్ర పోటీ..?

అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో భాగంగా మంగళవారం అక్కడ ఓటింగ్‌ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సెనెట్‌లో డెమొక్రాట్లకు మెజారిటీ ఉన్నప్పటికీ హౌస్‌లో (ప్రతినిధుల సభ) మాత్రం గట్టి పోటీ ఉండనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

Published : 09 Nov 2022 01:07 IST

వాషింగ్టన్‌: అమెరికాలో మధ్యంతర ఎన్నికల్లో భాగంగా మంగళవారం అక్కడ ఓటింగ్‌ ప్రారంభమైంది. కాంగ్రెస్‌పై పట్టు సాధించేందుకు ఓవైపు రిపబ్లికన్లు శ్రమిస్తుండగా.. మరో రెండేళ్లు అధికారంపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు డెమోక్రాట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెనెట్‌లో డెమోక్రాట్లకు మెజారిటీ ఉన్నప్పటికీ హౌస్‌లో (ప్రతినిధుల సభ) మాత్రం గట్టి పోటీ ఉండనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

అమెరికా కాంగ్రెస్‌లో హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ (ప్రతినిధుల సభ), సెనెట్‌లు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకొకసారి కాంగ్రెస్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతినిధుల సభ పదవీకాలం రెండేళ్లుకాగా, సెనెటర్ల పదవీకాలం ఆరు సంవత్సరాలు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో మూడోవంతు అంటే 35 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటు 36 రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికకు ఓటింగ్‌ జరుగుతోంది.

అయితే, అధ్యక్షుడు జో బైడెన్ రెండేళ్ల పాలనపై ప్రజాభిప్రాయాన్ని ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించనున్నాయి. ఇప్పటికే 4.20 కోట్ల మంది అమెరికన్లు ముందస్తుగా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో నవంబర్‌ 15న కీలక ప్రకటన చేస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. మధ్యంతర ఎన్నికల ఫలితాలు రాకముందే 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీపైనే ఈ ప్రకటన ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని