Kemune: కరవుతో ఎండిపోయిన జలాశయం.. బయటపడిన పురాతన నగరం!

ఇరాక్‌ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు 3,400 ఏళ్లనాటి పురాతన నగరం తాజాగా బయటపడింది. కరవు కారణంగా ఇక్కడి ఓ భారీ జలాశయం ఎండిపోయిన క్రమంలో.. ఆకస్మాత్తుగా ఈ నగర ఆనవాళ్లు వెలుగుచూడటం గమనార్హం...

Published : 07 Jun 2022 02:12 IST

బాగ్దాద్‌: ఇరాక్‌ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు 3,400 ఏళ్లనాటి పురాతన నగరం తాజాగా బయటపడింది. కరవు కారణంగా ఇక్కడి ఓ భారీ జలాశయం ఎండిపోయిన క్రమంలో.. ఈ నగర ఆనవాళ్లు వెలుగుచూడటం గమనార్హం. టైగ్రిస్‌ నది ఎండిపోయిన భాగంలో కనిపించిన ఈ స్థావరాన్ని.. కాంస్య యుగానికి చెందినదిగా భావిస్తున్నారు. నదిలో నీళ్లు లేకపోవడంతో.. ఇక్కడ తవ్వకాలకు వీలు కుదిరింది. క్రీ.పూ 1550- క్రీ.పూ 1350 మధ్య మిట్టని సామ్రాజ్య పాలనలో ఈ నగరం.. కీలక కేంద్రంగా విలసిల్లి ఉండొచ్చని కుర్దిష్‌, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది.

జర్మనీ పురావస్తు బృందంలోని డా.ఇవాన పుల్జిజ్‌ ఈ విషయమై ఓ పత్రికా ప్రకటన వెలువరుస్తూ.. ‘ఈ నగరం నేరుగా టైగ్రిస్‌లో బయటపడింది. అంటే.. అప్పట్లో ఇది మిట్టని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాన్ని(ప్రస్తుతం ఈశాన్య సిరియాలో ఉంది).. దాని తూర్పు ప్రాంతంతో అనుసంధానించడంలో ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చు’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. దీంతో.. పురాతన నగరం మరింత దెబ్బతినకుండా ఉండేందుకుగానూ దాన్ని పూర్తిగా ప్లాస్టిక్‌ షీట్‌లతో కప్పారు. మట్టి గోడలను, శిథిలాల్లో దాగి ఉన్న ఇతర వస్తువులను సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని