South Korea: కిమ్ ఉపగ్రహ ప్రయోగం.. దక్షిణ కొరియాపై ప్రజల ఆగ్రహం..!

North Korean rocket launch: బుధవారం ఉదయం దక్షిణ కొరియా ప్రాంత ప్రజలు తీవ్రంగా వణికిపోయారు. ఉత్తర కొరియా (North Korea) తొలిసారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం గురించి ద.కొరియా జారీ చేసిన హెచ్చరికలు వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి.

Updated : 31 May 2023 13:08 IST

సియోల్‌: ఉత్తర కొరియా (North Korea) తొలిసారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. దీంతో ఆ శకలాలు ఎక్కడ తమ దేశం మీద పడతాయోనని దక్షిణ కొరియా(South Korea) వణికిపోయింది. సమీప ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ.. హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. ఈ సమయంలో దక్షిణ కొరియా వ్యవహరించిన తీరు అక్కడి ప్రజల్లో పలు అనుమానాలకు దారితీసింది. అత్యవసర పరిస్థితుల్లో తమ దేశం సరిగ్గా వ్యవహరించలేదనే భయాన్ని వారు వ్యక్తం చేశారు.(North Korean rocket launch) 

రాకెట్‌ ప్రయోగం గురించి ఉదయం 6.41 సమయంలో దక్షిణ కొరియా తమ ప్రజల ఫోన్లకు సందేశాలు పంపింది. ‘మీ ప్రాంతాల నుంచి తరలివెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉండండి. ముందుగా చిన్నారులు, వృద్ధులు వెళ్లేలా చూడండి’అని తన హెచ్చరికలో పేర్కొంది. అసలు ఎందుకు తమ ప్రాంతాలను వీడాలో, ఎక్కడికి వెళ్లాలో మాత్రం చెప్పలేదు. ఈ అలర్ట్‌ వేళ.. ట్రాఫిక్ పెరగడంతో ఆ దేశ అతిపెద్ద ఇంటర్నెట్ పోర్టల్ క్రాష్ అయింది. ఏం చేయాలో పాలుపోక, ఎక్కడికి వెళ్లాలో తెలియక అలా 20 నిమిషాలు ద.కొరియా వాసులు భయాందోళనకు గురయ్యారు.

అప్పుడే మళ్లీ ప్రభుత్వం ఒక అలర్ట్‌ జారీ చేసింది. ఉదయం 6.41 గంటలకు తప్పుగా ప్రకటన జారీ చేశామని తెలిపింది. దాంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సియోల్ మేయర్ దిగిపోవాలని డిమాండ్ చేశారు. ‘మొదటి హెచ్చరికతో నేను ఎంతో భయపడ్డాను. నా ఇద్దరు పిల్లలను బేస్‌మెంట్‌లోని పార్కింగ్ ప్లేస్‌కు తీసుకెళ్తున్నాను. ఆ తర్వాత వచ్చిన ప్రకటనతో నాకు మాటలు రాలేదు. ఇలా చేస్తే నిజమైన హెచ్చరికలను ఎవరూ నమ్మరు’అని స్థానికుడొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ ఉపగ్రహం సియోల్ మెట్రో ప్రాంతం వైపు కాకుండా సముద్రంలో పడిపోయిందని తర్వాత ద.కొరియా మిలిటరీ వెల్లడించింది. అలాగే స్థానిక అధికారులు తాము ఇచ్చిన హెచ్చరికలను సమర్థించుకున్నారు. ‘ఆ సమయంలో మాది అతి స్పందనే కావొచ్చు. కానీ భద్రత విషయంలో ఏవిధంగానూ రాజీ పడలేం. అప్పుడు తక్షణ చర్య అవసరమని భావించాం’అని సియోల్‌ మేయర్‌ వెల్లడించారు. ద.కొరియాలో బంకర్ల నెట్‌వర్క్‌ ఉంది. కానీ ఇటీవల కాలంలో వాటిని వాడిన దాఖలాలు లేవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు