Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి

పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్‌ నుంచి క్వెట్టాకు

Published : 04 Jul 2022 02:05 IST

కరాచీ: పాకిస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 30 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్‌ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

‘‘బస్సు క్వెట్టా సమీపానికి రాగానే ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీశాం. గాయపడ్డ మరో 11 మందిని ఆస్పత్రిలో చేర్పించాం’’ అని అసిస్టెంట్‌ కమిషనర్‌ సయ్యద్‌ మెహ్తబ్‌ షా వెల్లడించారు. అతివేగం, భారీ వర్షమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బస్సు ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ బిజెంజో విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు అత్యవసర సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని