Mount Everest: నడవలేని స్థితి నుంచి ఎవరెస్ట్‌ శిఖరంపై నిలిచి.. అంతలోనే ప్రాణాలు విడిచి..!

ఎవరెస్ట్‌ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించాలన్న తన కలను నిజం చేసుకున్న ఓ ఆస్ట్రేలియన్‌ వ్యక్తి.. శిఖరం నుంచి కిందకు దిగి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.

Updated : 22 May 2023 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదిహేడళ్ల క్రితం ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని చూసి మళ్లీ నడవడం కష్టమే అని తేల్చేశారు వైద్యులు. కానీ, అతడు కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో కోలుకుని తిరిగి నడవడమే గాక.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరం (Mount Everest)పైకి ఎక్కి తన కల నెరవేర్చుకున్నాడు. అయితే, అదే అతడి చివరి ప్రయాణమవుతుందని అనుకోలేదు. ఎవరెస్ట్‌ శిఖరం నుంచి కిందకు దిగుతూ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.

ఆస్ట్రేలియా (Australia)లోని పెర్త్‌కు చెందిన 40 ఏళ్ల జేసన్‌ బెర్నార్డ్‌ కెన్నిసన్‌ (Jason Bernard Kennison) గత శుక్రవారం 8,849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించాడు. అక్కడి నుంచి కిందకు దిగే క్రమంలోనే జేసన్‌ ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురయ్యాడు. అది గమనించిన ఇద్దరు షెర్పా గైడ్లు ఆయనను 8,400 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బాల్కనీ ప్రాంతానికి తీసుకొచ్చారు. అయితే వారితో పాటు తెచ్చుకున్న ఆక్సిజన్‌ సిలిండర్లు నిండుకున్నాయి. దీంతో జేసన్‌ను క్యాంప్‌ 4 ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అప్పుడైతే వారు తిరిగి ఆక్సిజన్‌ సిలిండర్లను తెచ్చుకుని ఆయనను రక్షించొచ్చని ఆశించారు.

అయితే, దురదృష్టవశాత్తూ బలమైన గాలుల కారణంగా జేసన్‌ను తీసుకుని క్యాంప్‌ 4కు చేరుకోలేకపోయారు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయినట్లు షెర్పా గైడ్లు మీడియాకు వెల్లడించారు. ఎవరెస్ట్‌ (Mount Everest) పర్వతంపై 8000 మీటర్ల పైనున్న ప్రాంతాన్ని డెత్‌జోన్‌గా పేర్కొంటారు. అక్కడే జేసన్‌ మరణించారు. ఇప్పటికీ ఆయన మృతదేహం శిఖరంపైనే ఉందని గైడ్లు తెలిపారు. 17 క్రితం 2006లో జేసన్‌ ఆఫీసుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను చూసి మళ్లీ నడిచే అవకాశాలు లేవని వైద్యులు చెప్పారట. స్పైనల్‌ కార్డ్‌ దెబ్బతినడంతో చాలా నెలల పాటు జేసన్‌ మంచానికే పరిమితమయ్యారు. అయితే తిరిగి కోలుకోవడమే గాక.. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.

నేపాల్ (Nepal) టూరిస్ట్‌ విభాగం గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది 450 మంది పర్వతారోహకులు ఎవరెస్టు శిఖరం ఎక్కారు. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మంది ఎవరెస్ట్‌ పర్వతంపై ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని