భయానకం.. 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు..!

ఉత్తర అమెరికా దేశమైన మెక్సికో(Mexico)లో భయానక ఘటన వెలుగుచూసింది. మానవ శరీర భాగాలతో ఉన్న బ్యాగులు బయటపడటమే అందుకు కారణం. 

Updated : 02 Jun 2023 17:33 IST

మెక్సికో సిటీ:  ఉత్తర అమెరికా దేశం మెక్సికో(Mexico)లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఒకటి బయటకు వచ్చింది. దాదాపు 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాల(Human Body Parts)ను పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 

జాలిస్కో రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతమైన గాడలాజారాకు దగ్గర్లోని ఒక లోయలో 45 బ్యాగుల మానవ శరీరభాగాలు బయటపడ్డాయి. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. మే 20న దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్న ఏడుగురు యువతీయువకులు కనిపించకుండా పోయారు. వారి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారంతా ఒకే కాల్‌ సెంటర్‌(Call center)లో పనిచేస్తున్నారు. అయితే వారి  మిస్సింగ్ కేసులు మాత్రం వేర్వేరు రోజుల్లో నమోదయ్యాయి.

మరోపక్క.. వారు పనిచేస్తోన్న కాల్‌ సెంటర్‌కు సమీపంలోనే ఈ బ్యాగులు దొరికాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ కాల్‌ సెంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాదకద్రవ్యాలు,  రక్తపు మరకలతో ఉన్న వస్తువులు, కొన్ని దస్త్రాలను గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆ శరీరభాగాలు ఎవరివనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

జాలిస్కో రాష్ట్రంలో ఇలా బ్యాగుల్లో మానవశరీర భాగాల(Human Body Parts)ను గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో టోనాలా ప్రాంతంలో 70 బ్యాగుల్లో అవశేషాలు బయటపడ్డాయి. అవి 11 మంది వ్యక్తులవని అప్పుడు వెల్లడైంది. 2019లో 29 వ్యక్తులకు చెందిన 119 బ్యాగులను గుర్తించారు. ఇక 2018లో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసు(Missing Case) దేశంలో తీవ్ర నిరసనకు దారితీసింది. వారి శరీర అవశేషాలను యాసిడ్‌ పోసి కరిగించడమే అందుకు కారణం. ఇలా అక్కడ వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితికి అక్కడి డ్రగ్స్ మాఫియానే కారణంగా కనిపిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని