Sheikh Hasina: మా పోర్టులు భారత్‌ వాడుకోవచ్చు: హసీనా

అవసరం అనుకుంటే భారత్‌ (India) తమ దేశంలోని చట్టోగ్రామ్‌ (Chattogram), షిల్హెట్‌ (Sylhet) పోర్టులను వినియోగించుకోవచ్చని బంగ్లాదేశ్‌ ఆఫర్‌ చేసినట్లు అక్కడి వార్తా పత్రిక పేర్కొంది.

Published : 21 Mar 2023 00:28 IST

ఢాకా: భారత్‌ (India)తో సత్సంబంధాల నేపథ్యంలో పొరుగుదేశం బంగ్లాదేశ్‌ (Bangladesh) ఆఫర్‌ ఇచ్చింది. అవసరమైతే తమ దేశంలోని చట్టోగ్రామ్‌ (Chattogram), సిల్హెట్‌ (Sylhet) పోర్టులను భారత్‌ వినియోగించుకోవచ్చని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా పేర్కొన్నారు. ఈ మేరకు ఢాకా ట్రైబ్యూన్‌ వార్తా పత్రిక వెల్లడించింది. విదేశాల మధ్య వాణిజ్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ అనుసంధానాన్ని వృద్ధి చేసేందుకే బంగ్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని పోర్టుల్లో చట్టోగ్రామ్‌ ప్రధానమైనది. భౌగోళికంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు అతి సమీపంలో ఉంటుంది. ఈ పోర్టును భారత్‌ వినియోగించుకోవడం వల్ల సరకు రవాణా లాభదాయకంగా ఉంటుంది. అలాగే సిల్హెట్‌పోర్టు వల్ల కూడా భారత్‌కు ప్రయోజనం కలిగే వీలుంది.

ఇండియా ఫౌండేషన్‌ సభ్యుడు రామ్‌మాధవ్‌తో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఆదివారం ఆమె అధికారిక నివాసం గానాభబన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హసీనా తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు ఢాకా ట్రైబ్యూన్‌ తాజాగా వెల్లడించింది. ‘బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్‌, సిల్హెట్‌ పోర్టులను అవసరం అనుకుంటే భారత్‌ ఉపయోగించుకోవచ్చు’ అని రామ్‌మాధవ్‌తో ఆమె చెప్పినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీనివల్ల ఇరుదేశాల మధ్య ప్రాంతీయ అనుసంధానత మెరుగుపడుతుందని హసీనా అభిప్రాయపడినట్లు తెలిపింది. మరోవైపు షేక్‌హసీనా నేతృత్వంలో బంగ్లాదేశ్‌ ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిబాటలో పయనించడాన్ని రామ్‌మాధవ్‌ అభినందించారు. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, భవిష్యత్‌లోనూ ఇదే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చట్టోగ్రామ్‌ పోర్టును గతంలో చిట్టగాంగ్‌ అని పిలిచేవారు. బంగ్లాదేశ్‌కు అగ్నేయతీరంలో ఉంది. మరో పోర్టు సిల్హెట్‌ను గతంలో సూఫీగా పిలిచే వారు. ఇది తూర్పు బంగ్లాదేశ్‌లోని సుర్మా నదిపై ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని