China: ఐదు కోట్ల అమెరికా కంప్యూటర్లా..మార్చేయండి : చైనా ఆదేశాలు..!

ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడుకొని గూఢచర్యం చేయడంలో చైనాది అందెవేసిన చేయి. అలాంటి చైనానే ఇప్పుడు విదేశీ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్లు వాడటానికి భయపడుతోంది.  ప్రభుత్వ కార్యాలయాలు,

Updated : 09 May 2022 15:04 IST

 ఆంక్షల భయంతో డ్రాగన్‌ చర్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడుకొని గూఢచర్యం చేయడంలో చైనాది అందెవేసిన చేయి. అలాంటి చైనానే ఇప్పుడు విదేశీ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్లు వాడటానికి భయపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీల్లో ఉన్న కోట్లాది కంప్యూటర్లను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. రెండేళ్లలోపు స్థానిక ప్రత్యామ్నాయాలతో వీటిని భర్తీ చేయాలని సూచించింది. కీలక విభాగాల్లో విదేశీ టెక్నాలజీల వినియోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇక చైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కనీసం 5 కోట్ల కంప్యూటర్లను మాత్రం కచ్చితంగా తొలగించాల్సి ఉంది. మరో రెండేళ్లలో ప్రావిన్స్‌ల్లోని ప్రభుత్వాలు కూడా దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకోవచ్చు. అమెరికాపై ఆధారపడితే ఆంక్షల రూపంలో ఎప్పుడైనా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. 

చైనా దాదాపు పదేళ్ల నుంచి విదేశీ టెక్నాలజీల వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకొంది. ప్రభుత్వ అధికారిక కొనుగోళ్ల జాబితాలో ఉంటే వాటిని తొలగించేందుకు మొగ్గుచూపేది. ఈ నేపథ్యంలో హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు చైనా ప్రభుత్వ మద్దతున్న సంస్థలతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసి ఆర్డర్లను కాపాడుకొన్నాయి. కానీ, తాజా నిర్ణయంతో ఇప్పుడు అది వేగవంతమైంది. ముఖ్యంగా భౌగోళిక రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి అయిన అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని పేర్కొంది. 

లెనోవాకు జాక్‌పాట్‌..!

సెమీకండెక్టర్లు, సర్వర్లు, ఫోన్లు వంటి వాటిల్లో చైనా ఇప్పటికీ అమెరికాపై ఆధారపడుతోంది. చైనా నిర్ణయంతో హెచ్‌పీ, డెల్‌ వంటి సంస్థలపై ప్రభావం చూపనుంది. చైనా సంస్థ లెనోవాకు ఇది కలిసొచ్చే నిర్ణయం. ఈ విషయం బయటకు వచ్చాక శుక్రవారం హాంకాంగ్‌ మార్కెట్లో లెనోవా షేర్లు 5శాతం పెరిగాయి. బీజింగ్‌ నుంచి లెనోవాకు భారీగా ఆర్డర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిప్‌ల కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు మొత్తం 15రకాల చిప్‌డిజైన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. 

మరోపక్క దేశీయంగా హార్డ్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి లెనోవా, హువావే, ఇన్‌స్పర్‌ లిమిటెడ్‌లు పనిచేస్తున్నాయి. వీటికితోడు మైక్రోసాఫ్ట్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అభివృద్ధికి కింగ్‌సాఫ్ట్‌, స్టాండర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ వంటి సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

2016లోనే కమిటీ ఏర్పాటు..

అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనా 2016లో ది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ ఇన్నోవేషన్‌ వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమ ప్రమాణాలు నిర్దేశించడానికి, వృత్తి నిపుణులకు శిక్షణకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. వందల కొద్దీ పీసీ, చిప్స్‌, నెట్‌వర్కింగ్‌, సాఫ్ట్‌వేర్‌ సరఫరాదారులతో కలిసి ఇది పనిచేస్తోంది. 

అమెరికాపై టెక్‌ ఆధిపత్యానికి బ్లూప్రింట్ ఇలా..

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలతో టెక్‌ రంగాన్ని ఏలేందుకు చైనా ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించింది. చైనాను లేబర్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి టెక్‌ దిగ్గజంగా తీర్చిదిద్దడమే దాని లక్ష్యం. చైనా డిజిటల్‌ కరెన్సీ ప్రాజెక్టు కూడా దీనిలోని భాగమే. 

లిటిల్‌ జెయింట్స్‌గా..

వ్యూహాత్మకంగా కీలకమైన రంగాల్లో  సృజనాత్మకంగా ప్రారంభించిన కొత్త స్టార్టప్‌లను గుర్తిస్తారు. ఆ తర్వాత వీటికి పన్ను మినహాయింపులు, ఆర్థిక సాయం అందిస్తుంది. 2019 నుంచి ఈ ఏడాది జనవరి వరకూ మొత్తం 4,762 స్టార్టప్‌లను ఈ పథకం కింద గుర్తించింది. 2025 నాటికి ఈ సంస్థ 10,000కు చేరాలన్నది లక్ష్యం. అలీబాబా, టెన్సెంట్‌ వంటి బిలియనీర్ల ఆధీనంలోని కంపెనీలను చైనా ప్రభుత్వం అణగదొక్కాక ఈ పథకానికి ప్రాధాన్యం లభించింది. 

మేడిన్‌ చైనా 2025..

2015లో దేశంలోని 10 కీలక రంగాలను గుర్తించి.. వీటిల్లో చైనా ప్రపంచ స్థాయి దిగ్గజంగా మారాలని లక్ష్యంగా పెట్టుకొంది. వీటిల్లో రోబోటిక్స్‌, న్యూ ఎనర్జీ వెహికల్స్‌, బయో టెక్నాలజీ, వైమానిక రంగం, అడ్వాన్డ్స్‌ రైల్‌ ఎక్విప్‌మెంట్‌, స్క్రీన్లు, సోలార్‌ ప్యానల్స్‌లో వాడే పరికరాలు, సాఫ్ట్‌వేర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాలు వీటిల్లో ఉన్నాయి. 2030 నాటికి ఆర్టిఫిషియల్‌ ఇన్నోవేషన్‌ కేంద్రంగా చైనాను తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకొంది. 

మౌలిక వసతుల దిగ్గజంగా..

చైనా 2020 నుంచి 2025 మధ్యలో 1.4ట్రిలియన్‌ డాలర్లను ఫిఫ్త్‌ జనరేషన్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు, సర్వైలెన్స్‌ కెమేరాలు, సెన్సర్ల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు వెచ్చించనుంది. దీంతోపాటు హైస్పీడ్‌ రైళ్లు, అల్ట్రాపవర్‌ విద్యుత్తులైన్ల నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం.

సైన్స్‌పార్కుల ఏర్పాటు..

బీజింగ్‌, నాన్‌జింగ్‌ వంటి నగరాల్లో ప్రత్యేక సైన్సు పార్కుల ఏర్పాటు చేయాలని తలపెట్టింది. వీటిల్లోని కంపెనీలకు ప్రత్యేకగా పన్ను రాయితీలు, ఆర్థిక సహకారం అందిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని