US: బైడెన్‌ సర్కారులో మరో భారత-అమెరికన్‌కు కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) పాలకవర్గంలో దాదాపు 150 మందికి పైగా భారత అమెరికన్లు కీలక పదవుల్లో ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా మరో ఇండో-అమెరికన్‌, మహిళా పారిశ్రామికవేత్త చేరారు.

Published : 17 Jul 2023 14:16 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రభుత్వంలో మరో భారత - అమెరికన్‌ (Indian-American)కు కీలక పదవి దక్కింది. ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త, మాస్టర్‌కార్డ్‌ సెంటర్‌ ఫర్ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ వ్యవస్థాపకురాలు షమీనా సింగ్‌ (Shamina Singh)ను ‘ఎగుమతుల మండలి’ సభ్యురాలిగా బైడెన్‌ నియమించారు. ఈ మేరకు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఎగుమతుల మండలిలో షమీనా కీలక పాత్ర చేపట్టనున్నట్లు శ్వేతసౌధం (White House) తెలిపింది. తన నియామకంపై షమీనా ఆనందం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్‌ ఎగుమతుల కమిటీలో చేరడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ మండలి.. అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది. వాణిజ్యం, ఎగుమతుల విస్తరణ, వాణిజ్య సంబంధ అంశాలపై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలకు ఈ మండలి.. అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంటుంది.

షమీనా సింగ్‌ గతంలోనూ శ్వేతసౌధం, ప్రతినిధుల సభలో కీలక పదవులు చేపట్టారు. ఆసియాన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌పై మొదటి అధ్యక్ష సలహా కమిషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2015లో అమెరికార్ప్స్‌ బోర్డు సభ్యురాలిగా అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆమెను నియమించారు. బైడెన్‌ యంత్రాంగంలో ఇప్పటికే దాదాపు 150కి పైగా మంది భారత అమెరికన్లు కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా షమీనా సింగ్‌ కూడా ఈ జాబితాలో చేరారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని