
China: బీజింగ్లో ఒమిక్రాన్ కేసుకు కెనడా పార్సిలే కారణం.. చైనా వాదన!
కొట్టిపారేసిన కెనడియన్ అధికారులు
ఇంటర్నెట్డెస్క్: కరోనా కట్టడి విషయంలో చైనా కఠినంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. జీరో కొవిడ్ విధానాలతో లక్షలాది మందిని లాక్డౌన్లోకి నెడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీజింగ్లో తొలి ఒమిక్రాన్ కేసు బయటపడింది. అయితే, ఈ కేసుకు.. కెనడా నుంచి వచ్చిన ఓ పార్సిలే కారణమై ఉంటుందని ‘బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్’ అనుమానం వ్యక్తం చేసింది. ఇటీవల స్థానికంగా ఓ యువతి.. కెనడా నుంచి అమెరికా, హాంకాంగ్ మీదుగా మూడు రోజుల్లో బీజింగ్కు చేరుకున్న ఓ పార్సిల్ను అందుకున్నారు. అనంతరం ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ సోకినట్లు నిర్ధరణ అయింది.
మరోవైపు చైనా వాదనను.. కెనడియన్ ఆరోగ్య అధికారులు తోసిపుచ్చారు. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జీన్ వైవ్స్ డుక్లోస్ ఈ అభిప్రాయాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించారు. చైనా ఆరోపణలు సరికావన్నారు. కెనడా ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ సుప్రియా శర్మ ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. ప్యాకేజీలు అంతర్జాతీయ రవాణా మాధ్యమాల ద్వారా వెళ్తాయి కాబట్టి.. వాటిపై వైరస్ మనుగడ సాగించడం అసాధ్యమన్నారు. ఈ విధంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రతిపక్ష నేత ఎరిన్ ఓ టూల్ డ్రాగన్ వాదనలను హాస్యాస్పదమని కొట్టిపారేశారు.
కొవిడ్ వ్యాప్తి మొదలు.. పార్శిళ్లు, సరకుల ద్వారా వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు ఉన్నా.. ఈ విధంగా కరోనా వ్యాపించినట్లు ఇప్పటి వరకు బలమైన ఆధారాలు లేవు. కానీ, చైనా మాత్రం ఇటీవల డ్రాగన్ ఫ్రూట్లపై వైరస్ జాడలు ఉన్నాయంటూ.. పొరుగున ఉన్న వియత్నాం నుంచి ఆ పండ్ల దిగుమతులపై నిషేధం విధించింది. సూపర్ మార్కెట్లనూ మూసివేయించింది. ఫిబ్రవరిలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్యమివ్వనున్న దృష్ట్యా.. చైనా అధికారులు వైరస్ నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.