Pakistan: బడ్జెట్‌ ప్రవేశపెట్టిన పాక్‌.. సగం అప్పులకే కేటాయింపు!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ (Pakistan) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో సగం మొత్తం అప్పుల కోసం కేటాయించగా, బడ్జెట్‌ రెండో పెద్ద మొత్తాన్ని రక్షణ రంగానికి కేటాయించింది. 

Published : 10 Jun 2023 00:19 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌ (Pakistan) శుక్రవారం 2023-24 ఏడాదికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 14.5 ట్రిలియన్ పాక్‌ రూపాయల (సుమారు 50.5 మిలియన్‌ డాలర్లు) బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో 7.3 ట్రిలియన్‌ పాక్‌ రూపాయలు అప్పులు చెల్లించేందుకు కేటాయించారు. గత కొంతకాలంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో పాక్‌ రూపాయి విలువ పడిపోయి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో దేశంలో పారిశ్రామికోత్పత్తి క్షీణించింది. 

పాక్‌లో ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 950 బిలియన్‌ పాక్‌ రూపాయలను దేశంలో పలు అభివృద్ధి పనులకు కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం కేటాయింపులు ఈ దఫా 35 శాతం పెరగ్గా, పెన్షన్ల కోసం కేటాయించే మొత్తం 17.5 శాతం పెరిగింది. పాక్‌ ప్రస్తుతం అనుభవిస్తున్న దుస్థితికి గత పాలకులే కారణమని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. అయితే, ఈ బడ్జెట్‌లో పాక్‌ రక్షణ రంగానికి గతేడాది కంటే 15.5 శాతం ఎక్కువగా నిధులు కేటాయించింది. గతేడాది 1.5 ట్రిలియన్‌ పాక్‌ రూపాయలు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో 1.8 ట్రిలియన్‌ పాక్‌ రూపాయలు కేటాయించింది. అప్పుల చెల్లింపుల తర్వాత బడ్జెట్‌లో ఎక్కువ మొత్తం కేటాయింపులు చేసింది రక్షణ రంగానికే కావడం గమనార్హం.

గత కొద్దికాలంగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రుణాలు పెరిగిపోయి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌కు 34.1 శాతం అప్పులు పెరిగాయి. మరోవైపు, రుణాలు ప్రతి నెలా 2.6 శాతం చొప్పున పెరుగుతున్నట్లు ఒక వార్తాకథనం పేర్కొంది. ఈ పరిస్థితుల మధ్య దేశం దివాళా తీయకుండా ఉండేందుకు ఐఎంఎఫ్ ప్యాకేజీని పొందేందుకు పాక్‌ చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పాక్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు దేశ ఆర్థికపరిస్థితి ఇంతగా ఎన్నడూ దిగజారలేదు. గత కొన్నేళ్లుగా పాక్‌ ఆర్థికవ్యవస్థ పతనమవుతోంది. ఇది పేద ప్రజలపై ద్రవ్యోల్బణం రూపంలో తీవ్ర భారాన్ని మోపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని