China: అమ్మాయిలను బ్యాన్‌ చేశారని.. అబ్బాయిలతో..!

ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనాలోని ఆన్‌లైన్‌ వ్యాపార నిర్వాహకులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళల స్థానంలో పురుష మోడళ్లను ఉంచి ప్రకటనలు చేస్తున్నారు.

Published : 04 Mar 2023 06:55 IST

బీజింగ్‌: ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనలు చేయకుండా అమ్మాయిలపై చైనా నిషేధించిన నేపథ్యంలో అక్కడి ఆన్‌లైన్‌ వ్యాపార నిర్వాహకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రచార వీడియోల్లో అమ్మాయిలకు బదులు, అబ్బాయిలకు లోదుస్తులు ధరింపజేసి చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలనే ఆన్‌లైన్‌లో పోస్టు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకు న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం వెలువరించింది. 

న్యూయార్క్‌ పోస్టు కథనం ప్రకారం.. లోదుస్తులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రకటనల్లో అమ్మాయిలు ఉండటం వల్ల అశ్లీలత పెచ్చుమీరుతోందన్న ఉద్దేశంతో చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎట్టిపరిస్థితుల్లో ఆన్‌లైన్‌ ప్రచారాలకు మహిళలను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ఏకంగా ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ వ్యాపార నిర్వాహకులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీనిని అధిగమించేందుకు కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు అమ్మాయిల స్థానంలో అబ్బాయిలను నియమించుకొని వారితో మోడలింగ్‌ చేయించారు. కొంత వరకు ఇది మంచి ఫలితాలనే ఇవ్వడంతో మిగతావారు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అమ్మాయిల లోదుస్తులు వేసుకున్న పురుష మోడల్స్‌ వీడియోలు ప్రస్తుతం అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నట్లు న్యూయార్క్‌టైమ్స్‌ పేర్కొంది. ‘‘ఒకవేళ ఆ వీడియోలో ఉన్నది మహిళా మోడల్‌ అయితే ఆ సంస్థ పరిస్థితి వేరేలా ఉండేది. తర్వాతి నిమిషంలోనే ఆ సంస్థకు మూత పడేది. అందుకే పురుష మోడళ్లతో వీడియోలు తీస్తోంది’’ అంటూ ఒక యూజర్‌ కామెంట్‌ చేశాడట. ‘ఆ దుస్తులు అమ్మాయిల కంటే.. అబ్బాయిలు వేసుకుంటేనే బాగుంది కదా’ అని మరో యూజర్‌.. షేక్స్‌పియర్‌ కాలంలోనూ వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతించలేదు. అప్పుడు కూడా మగవాళ్లే వారి పాత్రల్లో నటించేవారు’ అని ఇంకో యూజర్‌ కామెంట్‌ చేశాడట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని