iCET: అవన్నీ జరిగేవి కావులే.. భారత్‌-అమెరికా ఒప్పందంపై చైనా వాఖ్యలు

భారత్‌, అమెరికా మైత్రిపై చైనా అక్కసు వెళ్లగక్కింది. అది నిలిచేది కాదులే అంటూ గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక కథనం వెలువరించింది.

Published : 02 Feb 2023 10:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్(India)‌-అమెరికా(USA) మధ్య అంత్యంత కీలకమైన ఐసీఈటీ (ఇనీషియేటీవ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ)పై చైనా(china) అక్కసు వెళ్లగక్కింది. ఈ కొత్త ఒప్పందంపై చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ అక్కసు వెళ్లగక్కుతూ కథనం వెలువరించింది. కలిసి ఉన్న వ్యక్తుల మధ్య విభిన్న ఆలోచనలు.. ఎందుకు..? అని ప్రశ్నించింది. ‘‘వాషింగ్టన్‌ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనుకుంటోంది. ఓ వైపు భారత్‌ను తనవైపు లాక్కొని.. తన దేశానికి ఏం కావాలో దానిని సాధిస్తోంది. అదే సమయంలో భారత్‌ను మిత్ర బృందం జాబితాలో ఉంచి.. చైనాకు ప్రత్యామ్నాయ పంపిణీ గొలుసు వ్యవస్థగా ఇండియాను మారుస్తోంది. చైనా టెక్నాలజీ వృద్ధిని కూడా దెబ్బతీయొచ్చని భావిస్తోంది’’ అని షాంఘై ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌కు చెందిన లూ జాంగ్‌యి తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇది అమెరికా వ్యూహాత్మకంగా చేస్తోందని పేర్కొన్నారు. అయితే, భారత్‌.. అమెరికాకు వంతపాడే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఇది విజయవంతం కాదని అభిప్రాయపడ్డారు.

చైనాను కట్టడి చేయడానికి ఐసీఈటీ ఒప్పందం చేసుకొన్నారా అన్న ప్రశ్నలకు అమెరికా(USA) శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియర్‌ స్పందించారు. ‘‘భౌగోళిక రాజకీయ కోణాన్ని విస్మరించలేము.. కానీ, ఇది ఎవరినో ఉద్దేశించి చేసుకొన్న ఒప్పందం కాదు. ఇది అంతకన్నా పెద్దది. భారత్‌తో స్నేహాన్ని అమెరికా మరింత బలోపేతం చేసుకుంటుంది’’ అని పేర్కొన్నారు. అంతకు ముందే అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సులేవాన్‌ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ..‘‘భారత్‌-అమెరికా సంబంధాల్లో ‘చైనాతో పోటీ’ అనేది ముఖ్య లక్షణంగా కనిపిస్తోంది. కాకపోతే మా బంధంలో భారత్‌ ఎదుగుదల గురించే.. ఆ ఎదుగుదలలో అమెరికా భాగస్వామ్యం గురించే ఎక్కువగా ఉంది’’ అని వివరించారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఆయన  జాక్‌ సులేవాన్‌తో చర్చలు జరిపారు. అమెరికాతో టెక్నాలజీ రంగంలో వ్యూహాత్మకంగా, వాణిజ్య పరంగా  కలిసి పనిచేసే అంశంపై చర్చించారు. గతేడాది మే నెలలో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐసీఈటీ ఇనీషియేటీవ్‌ను ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని