China: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!

చైనా ఒకే రోజు రెండు భారీ సైన్సు ప్రాజెక్టులను ప్రారంభించింది. మంగళవారం ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగా.. మరోవైపు షింజియాంగ్‌ ప్రావిన్స్‌లో అత్యంత లోతైన బోర్‌ తవ్వకానికి శ్రీకారం చుట్టింది. ఈ బోర్‌ లోతు 10,000 మీటర్లు ఉండనుంది.

Updated : 31 May 2023 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వకాన్ని మంగళవారం నుంచి చైనా(china) శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు. దీంతో చైనా భూగర్భాన్వేషణలో మరో ముందడుగు పడినట్లైంది. ఈ రంధ్రం సుమారు 10,000 మీటర్ల లోతు ఉండొచ్చని అంచనా. చైనాలోని షింజియాంగ్‌ (Xinjiang) ప్రాంతంలో ఈ తవ్వకాన్ని నిన్న మొదలుపెట్టారు. ఆ దేశం తవ్వుతున్న అత్యంత లోతైన రంధ్రంగా ఇది నిలవనుంది. ఈ విషయాన్ని చైనాకు చెందిన షిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. మరో వైపు అదే సమయంలో చైనా  విజయవంతంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపింది. వారిలో దేశ తొలి పౌర వ్యోమగామి గుయ్‌ హైచావో కూడా ఉన్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని తమ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించడం విశేషం. ఇది చైనా అంతరిక్ష కార్యక్రమంలో కీలక ముందడుగు. ముగ్గురు వ్యోమగాములు షెంజౌ-16 వ్యోమనౌకలో రోదసిలోకి పయనమయ్యారు. లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ దీన్ని మోసుకెళ్లింది. భూమి పైనా.. లోపల ఒకేసారి పరిశోధనలను ముందుకు తీసుకెళ్లినట్లైంది. ‘‘ఈ డ్రిల్లింగ్‌ ప్రాజెక్టు అత్యంత కఠినమైంది. ఓ భారీ ట్రక్కును రెండు సన్నటి తీగలపై నడిపించినట్లు ఉంటుంది’’ అని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ శాస్త్రవేత్త సున్‌ జింషెంగ్‌ పేర్కొన్నారు. 

చైనా తాజా తవ్వకాలు భూమి అడుగున దాదాపు 10 రాతి పొరలను చీల్చుకొంటూ సాగనున్నాయి. ఇది దాదాపు 145 మిలియన్‌ సంవత్సరాల వయస్సున్న క్రెటెషియస్‌ పొరను చేరుకోనున్నాయి. ఇప్పటికే 2021లో భూగర్భ అన్వేషణను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభినందించారు. ఇవి ఖనిజ సంపద, ఇంధన వనరులను గుర్తించడంతోపాటు.. భూకంపాలు, అగ్నిపర్వతాల ముప్పును ముందే పసిగట్టగలదన్నారు. ప్రపంచంలోనే మానవులు తవ్విన అత్యంత లోతైన రంధ్రం రష్యాలో ఉంది. కోలా సూపర్‌ డీప్‌ బోర్‌హోల్‌గా దీనిని వ్యవహరిస్తారు. ఇది 12,262 మీటర్లు ఉంది. 20 ఏళ్లపాటు బోర్‌ వేయగా 1989లో ఈ లోతుకు అది చేరుకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని