China: యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. రక్షణ బడ్జెట్‌ పెంచనున్న చైనా

ఇప్పుటికే చుట్టుపక్కల దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా భారీగా రక్షణ బడ్జెట్‌ను పెంచింది. తైవాన్‌ వద్ద చోటు చేసుకొన్న పరిణామాలతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

Updated : 05 Mar 2023 11:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China) రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి పెంపు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. దీంతో ఇది 230 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ఈ మేరకు చైనా ఆర్థిక శాఖ ముసాయిదాను విడుదల చేసింది. చైనా (China) రక్షణ బడ్జెట్‌ పెంపు వరుసగా ఇది 8వసారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్‌ పెంపు రేటు అధికంగా ఉండటం గమనార్హం.

చైనా దళాలు యుద్ధ సన్నద్ధతను మెరుగుపర్చుకోవాలని ప్రీమియర్‌ లి క్వికియాంగ్‌ పిలుపునిచ్చారు. ముసాయిదా ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ సైనిక ఆపరేషన్లు, సామర్థ్యాల పెంపు, యుద్ధ సన్నద్ధత వంటివి సమన్వయం చేసుకొంటూ ప్రధాన లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. ‘‘మా సాయుధ దళాలు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకొన్న లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. సైనిక ఆపరేషన్ల నిర్వహణపై పని చేయాలి. యుద్ధ సన్నద్ధతను మెరుగు పర్చుకోవాలి. సైనిక సామర్థ్యాలను పెంచుకోవాలి’’ అని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో లి క్వికియాంగ్‌ పేర్కొన్నారు.

తైవాన్‌లో అమెరికా దళాల కార్యకలాపాలు పెరుగుతున్నట్లు వార్తలొస్తుండటంతో చైనా ఆందోళనకు గురవుతోంది. మరోవైపు తైవాన్‌ జలసంధిలో అమెరికా రాజ్య నౌకాదళం, వాయుసేనలు గస్తీలను ముమ్మరం చేయడం ఇబ్బందికరంగా భావిస్తోంది. గతేడాది ఆగస్టులో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత డ్రాగన్‌ తైవాన్‌ సమీపంలో భారీగా యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. చైనా పదాతి దళం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది తమ సైనికులకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడంపై, సరికొత్త స్టెల్త్‌  ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విమానాలను సర్వీసుల్లో చేర్చుకోవడంపై తీవ్రంగా శ్రమిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని