Wuhan: కొవిడ్‌-19 పుట్టిన వుహాన్‌లో.. మళ్లీ లాక్‌డౌన్‌

కొవిడ్‌-19 మొట్టమొదటగా వెలుగు చూసిన వుహాన్‌లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూడడం కలవరపెడుతోంది. దీంతో వుహాన్‌లోని పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ ఆంక్షలను చైనా విధించింది.

Published : 26 Oct 2022 14:24 IST

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కొవిడ్‌-19 (Coronavirus) మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్‌లో (Wuhan) వెలుగు చూసిన సంగతి తెలిసిందే. మూలాలపై ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ వుహాన్‌లోనే కొవిడ్‌ ఉద్భవించిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మళ్లీ అక్కడ కరోనా కేసులు వెలుగు చూడడం కలవరపెడుతోంది. దీంతో వుహాన్‌లోని పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ (Lockdown) విధించారు.

సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్‌లోని హన్‌యాంగ్‌ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్‌ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ ఉంటాయని.. పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.

ప్రపంచంలోనే తొలిసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లిన ప్రాంతంగా వుహాన్‌ నిలిచింది. అటువంటి వుహాన్‌.. ఏప్రిల్‌ 2020 నాటికి వైరస్‌ను నిర్మూలించినట్లు పేర్కొంది. ఈ ప్రాంతంలో మళ్లీ కరోనా కేసులు బయటపడుతున్నాయి. వుహాన్‌లో 10లక్షల జనాభా కలిగిన జియాంగ్‌షియా జిల్లాలో ఇటీవల లాక్‌డౌన్‌ విధించారు. షాషి ప్రావిన్సులోని డాటొంగ్‌ నగరంతోపాటు గువాంగ్‌ఝువాలోనూ కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా హన్‌యాంగ్‌లోనూ లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఇలా వుహాన్‌తోపాటు చైనాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తూనే దానితో కలిసి జీవించే విధానాన్ని ప్రపంచ దేశాలు అవలంబిస్తుండగా.. చైనా మాత్రం జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని పాటిస్తోంది. ఒక్క కేసు వచ్చినా లక్షల సంఖ్యలో పరీక్షలు, క్వారంటైన్‌ నిబంధనలు విధిస్తోంది. కఠిన నిబంధనలపై స్వదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నప్పటికీ షి జిన్‌పింగ్‌ మాత్రం తమ విధానాన్ని సమర్థించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని