Philippines: ఫిలిప్పీన్స్‌ ద్వీపంపైకి చొచ్చుకెళ్లిన చైనా నౌకలు

ఫిలిప్పీన్స్‌ ఆధీనంలోని ద్వీపం వద్ద చైనా నౌకలు హల్‌చల్‌ చేశాయి. ఆ ద్వీపాలకు సమీపంలోకి వెళ్లి ప్రాదేశీక జలాల హద్దులను ఉల్లంఘించాయి. 

Published : 05 Mar 2023 17:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China) మరోసారి తన పొరుగు దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకొంది. ఈ సారి ఫిలిప్పీన్స్‌(Philippines) ఆధీనంలోని ఓ ద్వీపం వద్దకు చైనా నావికాదళానికి చెందిన నౌకలు, చేపలవేట ముసుగులో మిలీషియా పడవలు దూసుకెళ్లాయి. దీంతో ఇరు దేశాల మధ్య ప్రాదేశిక జలాల విషయంలో మరోసారి  ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్‌ నేవీ కూడా ధ్రువీకరించింది. 

చైనాకు చెందిన 42 మిలీషియా పడవలను ‘థిటు’ ద్వీపానికి అత్యంత సమీపంలో చూసినట్లు ఫిలిప్పీన్స్‌ పేర్కొంది. వీటికి కొద్ది దూరంలో చైనాకు చెందిన కోస్టుగార్డ్‌, నౌకాదళ ఓడలు నిదానంగా కదులుతున్నట్లు గుర్తించామని పేర్కొంది. ‘‘వారు నిరంతరాయం అక్కడే ఉండటం ఫిలిప్పీన్స్‌ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే’’ అని ఫిలిప్పీన్స్‌ కోస్టుగార్డ్‌ పేర్కొంది. ఈ నౌకల చిత్రాలను కోస్ట్‌గార్డ్‌ ట్విటర్‌లో విడుదల చేసింది. 

మనీలాలోని చైనా రాయబార కార్యాలయం  నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. దక్షిణ చైనా సముద్రంలో థిటు ద్వీపం ఫిలిప్పీన్స్‌కు ఉన్న అతిపెద్ద వ్యూహాత్మక ప్రాంతం. కానీ, దీని సమీపంలోని  సముద్ర జలాలను చైనా తనవిగా వాదిస్తోంది. ఇప్పటికే చైనా వ్యవహారశైలిపై ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రెండువారాల క్రితం ఆయన స్పందిస్తూ.. ‘‘ ఒక్క అంగుళం భూమి కూడా పోగొట్టుకోము’’ అని తేల్చిచెప్పారు. 

థిటు ద్వీపం పశ్చిమ ఫిలిప్పీన్స్‌లోని పాల్వన్‌ ప్రావిన్స్‌కు 300 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ కేవలం 400 మంది జనాభా మాత్రమే ఉన్నారు. వీరిలో సైనికులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది కూడా ఉన్నారు. మనీలా ప్రాదేశిక జలాలపై హక్కు కాపాడుకోవడానికి ఈ ద్వీపం చాలా కీలకం. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చేయడానికి చైనా చేపల పడవలను, కోస్టుగార్డులను ఆయుధాలుగా వాడుకొంటోంది. నిరంతరం ఈ పడవలు వివాదాస్పద ప్రాంతాల్లో ఉండటంతో ఇతరులు అక్కడ చేపల వేట నిర్వహించడం, చమురు అన్వేషణ చేపట్టడం కష్టంగా మారింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని