Chinese Spy Balloon: భారత్‌పై చైనా బెలూన్‌ గూఢచర్యం..!

చైనా నిఘా బెలూన్లను వాడి భారత్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించారు. చైనా వాయుసేన ఈ బెలూన్‌ నిఘాకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తోంది.

Updated : 24 Mar 2023 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా నిఘా బెలూన్‌(Chinese Spy Balloon) వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటువంటి బెలూన్ల సాయంతో డ్రాగన్‌ కొన్నేళ్లుగా నిఘా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చైనా నిఘాపెట్టిన దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. ఇందు కోసం చైనా పురాతన పద్ధతులకు అత్యాధునిక సాంకేతికతను జోడించి నిఘా కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ దేశాల సైనిక కదలికలను గమనిస్తోంది.

హెయినన్‌ ప్రావిన్స్‌ కేంద్రంగా..

హెయినన్‌ ప్రావిన్స్‌ కేంద్రంగా బెలూన్లతో చైనా(china) నిఘా కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడి దక్షిణ తీరంలో వీటిని ఎగురవేసి భారత్‌, జపాన్‌, వియత్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాల్లో సైన్యం, ఆయుధాల మోహరింపులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా సైనిక అధికారులు వాషింగ్టన్‌పోస్టుకు తెలియజేశారు. ఈ బెలూన్‌ నిఘా కార్యక్రమం చైనా వాయుసేన ఆధీనంలో జరుగుతోంది. ప్రపంచంలోని ఐదు ఖండాల్లో ఇటువంటి బెలూన్లు కనిపించాయి.

హెయినన్‌లో పీఎల్‌ఏ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలు కూడా ఉన్నాయి. దీనిని వాస్తవానికి నౌకాదళ కేంద్రంగా చెబుతారు. కానీ, జె-8 ఇంటర్‌సెప్టర్‌ విమానాల ప్రధాన బేస్‌ కూడా ఇక్కడే ఉంది. 2001లో ఇక్కడి నుంచి ఎగిరిన జె-8 విమానం అమెరికాకు చెందిన ఈపీ-3 నిఘా విమానాన్ని ఢీకొంది.

అమెరికాకు చెందిన డిప్యూటి విదేశాంగ శాఖ మంత్రి  వెండీ షెర్మన్‌..  చైనా బెలూన్‌ వ్యవహారంపై 40 దౌత్యకార్యాలయాలకు చెందిన 150 మందికి  సమాచారం తెలియజేశారు. అంతేకాదు ప్రతి అమెరికా దౌత్య కార్యాలయానికి సమగ్ర సమాచారం పంపించారు. ఆ సమాచారాన్ని అమెరికా మిత్రదేశాలతో పంచుకోనున్నారు. జపాన్‌ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలను చైనా లక్ష్యంగా చేసుకోవడంపై అప్రమత్తమైంది. 

200 అడుగుల ఎత్తైన భారీ ఆకారంలో..

చైనా ప్రయోగించిన బెలూన్‌ సుమారు 200 అడుగుల ఎత్తు ఉన్నట్లు సమాచారం. ఇది కొన్ని టన్నుల బరువును కూడా మోసేలా డిజైన్‌ చేశారు. సముద్రంలో దీనిని కూల్చిన ప్రదేశం నుంచి అమెరికా దళాలు శకలాలను సేకరిస్తున్నాయి. వీటిని చైనాకు తిరిగి ఇచ్చే ప్రశ్నేలేదని అమెరికా తేల్చిచెప్పింది. వీటిని విశ్లేషించి బెలూన్‌ సాంకేతిక సామర్థ్యాలు, అది ఏ ఉపగ్రహాలతో అనుసంధానమైంది, మరేమైనా సున్నితమైన పరికరాలు ఉన్నాయా అనేది నిర్ధారించుకోనున్నారు. దీంతోపాటు ఇది ఎటువంటి డిజిటల్‌ సిగ్నేచర్లను సేకరించిందో కూడా తెలుసుకోనున్నారు. అవసరమైతే వీటిల్లోని పరికరాలను పునర్‌నిర్మించి బెలూన్‌ పనితీరును పరిశీలించనున్నారు. దీంతోపాటు బెలూన్‌ నిర్మాణానికి ఉపయోగించిన పరికరాల సప్లైచైన్‌ను కూడా అమెరికా అధికారులు గుర్తించనున్నారు. అమెరికాలోనే అత్యున్నత నిపుణులు పనిచేసే ఎఫ్‌బీఐ ఆపరేషనల్‌ టెక్నాలజీ డివిజన్‌ బృందం శకలాలను విశ్లేషించనున్నారు. దాదాపు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో పడిన శకలాలను అమెరికా నౌకాదళం జాగ్రత్తగా సేకరిస్తోంది.

అమెరికా రక్షణ మంత్రి ఫోన్‌ చేసినా..

బెలూన్‌ను కూల్చివేసిన తర్వాత అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ చైనా రక్షణ మంత్రితో ఫోన్‌లో సంభాషించాలని ప్రయత్నించారు. కానీ, చైనా వైపు నుంచి స్పందన కరవైంది. ఇటువంటి సమయాల్లో మా సైన్యాల మధ్య కమ్యూనికేషన్‌  ఉండాలి.. కానీ, దురదృష్టవశాత్తు మా విన్నపాన్ని చైనా నిరాకరించిందని పెంటగాన్‌కు చెందిన బ్రిగేడియర్‌ జనరల్‌ పాట్రిక్‌ రైడర్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని