COVID: యూకేలో కరోనా విజృంభణ.. వారంలో 50లక్షల మందికి వైరస్‌

కరోనా వైరస్‌ ప్రస్తుతం బ్రిటన్‌ను వణికిస్తోంది. గడిచిన వారంరోజుల్లో దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కొవిడ్‌ బారిన పడినట్లు బ్రిటన్‌ అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి......

Published : 03 Apr 2022 01:40 IST

లండన్‌: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ మహమ్మారి ప్రస్తుతం బ్రిటన్‌ను వణికిస్తోంది. గడిచిన వారంరోజుల్లో దేశంలోని ప్రతి 13 మందిలో ఒకరు కొవిడ్‌ బారిన పడినట్లు బ్రిటన్‌ అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. గడిచిన వారంలో ఏకంగా 4.9 మిలియన్ల (49లక్షలు) మంది వైరస్‌కు గురైనట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. అంతకుముందు వారం 4.3 మిలియన్ల మందికి కొవిడ్‌ సోకింది.

ముఖ్యంగా ఒమిక్రాన్‌ ఉపవేరియంట్‌ అయిన బీఏ.2 ప్రస్తుతం బ్రిటన్‌లో తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనా తీవ్ర విజృంభణతో బ్రిటన్‌ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. మరణాల రేటు తక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే.. మృతుల సంఖ్య తక్కువగానే ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే తాజా కేసుల పెరుగుదలకు ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఫిబ్రవరి నెలలోనే అన్ని రకాల కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. ఆ తర్వాత కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని