Hana Horka: గాయని విపరీత చర్య.. ఉద్దేశపూర్వకంగా కొవిడ్ బారినపడి!

ఉద్దేశపూర్వకంగా కొవిడ్ సోకిన కుటుంబ సభ్యులతో కలిసుండి, వైరస్ బారినపడి, చివరకు మృత్యుఒడికి చేరారు చెక్ రిపబ్లిక్‌కు చెందిన జానపద గాయని. ఆమె హెల్త్‌పాస్‌ను పొందడం కోసమే ఈ విపరీత చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె కుమారుడే స్వయంగా వెల్లడించారు. 

Published : 21 Jan 2022 01:39 IST

ప్రేగ్‌: టీకా తీసుకున్నట్లు ఆధారం ఉన్నా, ఇటీవల కాలంలో కొవిడ్ సోకి తగ్గి ఉన్నా... బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చెక్ రిపబ్లిక్‌ అనుమతిస్తోంది. అలాగే ఈయూ సభ్య దేశాల్లో పర్యటించేందుకు, బార్లు, రెస్టారెంట్లకు వెళ్లేందుకు వీలు కల్పిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశానికి చెందిన ప్రముఖ జానపద గాయని హనా హోర్కా (57) ప్రాణాల పోయేలా చేసింది. దేశంలో తిరగడానికి ప్రభుత్వం ఇచ్చే పాస్‌ కోసం ఉద్దేశపూర్వకంగా కొవిడ్ సోకిన కుటుంబ సభ్యులతో కలిసుండి, ఆపై వైరస్ బారినపడి, చివరకు మృత్యుఒడికి చేరింది చెక్ రిపబ్లిక్‌కు చెందిన జానపద గాయని హనా హోర్కా.

కరోనా సోకిన హనా ఆదివారం మరణించారు. ప్రభుత్వం ఇస్తున్న హెల్త్‌ పాస్‌ను పొందడం కోసమే హనా ఈ విపరీత చర్యకు పాల్పడ్డారని ఆమె కుమారుడు జాన్‌ రెక్‌ వెల్లడించాడు. ఇంతకీ ఏమైందంటే... క్రిస్మస్ సమయంలో హనా భర్త, కుమారుడికి కరోనా సోకింది. ఆ సమయంలో ఆమె వారం పాటు కుటుంబానికి విడిగా ఉండాలి. కానీ ఉద్దేశపూర్వకంగానే కుటుంబంతో కలసి ఉండాలని హనా నిర్ణయించుకున్నారట. టీకా తీసుకోవడం కంటే కుటుంబంతో ఉండటానికే మొగ్గుచూపారని జాన్‌ రెక్‌ చెప్పాడు.

హనా గాయని కావడంతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంక్షలు అడ్డు కాకూడదనుకుంది. అందుకు ఆమె కరోనా సోకిన మాతో కలసి ఉండి, కరోనా వచ్చేలా చేసుకుంది అని జాన్‌ రెక్‌ తెలిపాడు. ఆమె తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాలకే ముప్పు తెచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘వ్యాధి తీవ్రత ఎక్కుగానే ఉండింది. ఇప్పుడు నేను కోలుకున్నాను. ఇకపై కావాల్సిన ప్రదేశాలకు వెళ్లొచ్చు’’ అంటూ మరణించడానికి రెండు రోజుల ముందు హనా నెట్టింట్లో పోస్టు పెట్టడం గమనార్హం.

టీకా వ్యతిరేక ఉద్యమమే తన తల్లి ప్రాణాలు తీసిందంటూ రెక్ తీవ్ర విమర్శలు చేశారు. టీకా తీసుకోకుండా ఆ ఉద్యమకారులు తన తల్లిని ఒప్పించారని, ఇప్పుడు వారి చేతులు రక్తంతో నిండిపోయాయి అంటూ మండిపడ్డాడు జాన్‌ రెక్‌. ‘‘మా అమ్మ బయటవ్యక్తుల్నే ఎక్కువగా నమ్మడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తప్పుడు సమాచారం వల్లే ఇదంతా జరిగింది’’ అంటూ వాపోయాడు రెక్‌. మరోవైపు చెక్‌ రిపబ్లిక్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కోటికి పైగా జనాభా ఉన్న ఆ దేశంలో 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని