Israel: పీఐజే రెండో టాప్‌ కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌..!

గాజాపట్టీపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీన ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజే)గ్రూప్‌నకు చెందిన మిలిటెంట్‌ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహిస్తోంది. దీంతో ఇక్కడ మృతులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది

Updated : 07 Aug 2022 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజాపట్టీపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజే)గ్రూప్‌నకు చెందిన మిలిటెంట్‌ నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది మరణించినట్లు సమాచారం. వీటిల్లో పీఐజే నాయకులు ఖలీద్‌ మన్సూర్‌, తైసీర్‌ జబారీ ఉన్నారు. మరో ఆరుగురు చిన్నారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నుంచి 400కు పైగా రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌పైకి గాజా నుంచి ప్రయోగించారు. పీఐజే నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించారు.

2021 మే నెల తర్వాత ఇజ్రాయెల్‌-గాజా మధ్య చోటు చేసుకొన్న అత్యంత హింసాత్మక ఘటనలు ఇవే. నాడు జరిగిన హింసలో 200 మంది పాలస్తీనా వాసులు, 12 మందికిపైగా ఇజ్రాయెల్‌ వాసులు ప్రాణాలు కోల్పోయారు.

ఇజ్రాయెల్‌ దళాలు బ్రేకింగ్‌డౌన్‌ పేరిట ఈ ఆపరేషన్‌ చేపట్టాయి. ఇది సుమారు వారం రోజులకు పైగా కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జరిగిన ఆపరేషన్‌లో రఫాలోని పీఐజే సీనియర్ నాయకుడు ఖలీద్‌ మన్సూర్‌ ఇంటిని ధ్వంసం చేశారు. గతంలో ఖలీద్‌ను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్‌ దళాలు దాదాపు ఐదు సార్లు ప్రయత్నించగా తప్పించుకొన్నాడు. గాజాలో మిలిటెంట్ ఆపరేషన్లకు ఇతడే బాధ్యుడని భావిస్తున్నారు. తాజా దాడిలో అతడిని ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టాయి. ఇక  వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ దళాలు వేర్వేరు దాడులు నిర్వహించి 19 మంది పీఐజే సభ్యులను అదుపులోకి తీసుకొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని