Afghanistan: అఫ్గానిస్థాన్‌ బాంబుపేలుడు.. డిప్యూటీ గవర్నర్‌ మృతి

అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఈ సారి వారు చేసిన కారుబాంబు దాడిలో ఓ ప్రావిన్స్‌ డిప్యూటి గవర్నర్‌ ప్రాణాలు కోల్పోయాడు. 

Published : 06 Jun 2023 16:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో తాలిబన్ల(Taliban)కు గట్టి దెబ్బతగిలింది. ఆ దేశంలోని బదాక్షన్‌ ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ నాసిర్‌ అహ్మద్‌ అహ్మది కారుబాంబు పేలుడులో మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని ప్రావిన్షియల్‌ అధికారిక ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటనపై ప్రావిన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీస్‌ అధిపతి ముజాహిద్దీన్‌ అహ్మది మాట్లాడుతూ ‘‘కారు బాంబు పేలుడులో నాసిర్‌ అహ్మద్‌ అహ్మది, ఆయన డ్రైవర్‌ సహా మరణించగా.. మరో ఆరుగురు పౌరులు ఈ దాడిలో గాయపడ్డారు’’ అని తెలిపారు. ఈ బాంబుపేలుడు వెనుక ఎవరున్నారన్న విషయం మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు. చాలా వారాల తర్వాత తాలిబన్‌ పాలనలో చోటు చేసుకొన్న అతిపెద్ద పేలుడు ఇదే. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారులో పేలుడు పదార్థాలను నింపుకొని అహ్మది ప్రయాణిస్తున్న వాహనం సమీపంలోకి దూసుకొచ్చి పేల్చేసుకొన్నాడు. ఈ ప్రావిన్స్‌లో సాంస్కృతిక, సమాచార విభాగానికి అహ్మది అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు. 

ఐసిస్‌ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తాలిబన్‌ ప్రభుత్వం ఇప్పటికే దాడులు మొదలుపెట్టింది. మరోవైపు ఐసిస్‌ ఉగ్రవాదులు పలు నగరాల్లో తీవ్రమైన దాడులు చేశారు. మార్చిలో బల్ఖ ప్రావిన్స్‌ గవర్నర్‌ను చంపినట్లు ఇప్పటికే ప్రకటించుకొంది. గత డిసెంబర్‌లో ఇదే ప్రావిన్స్‌లో పోలీస్‌ చీఫ్‌ను కూడా ఇటువంటి దాడిలోనే ఐసిస్‌ ఉగ్రసంస్థ హత్య చేసింది. అంతేకాదు 2022 ఏప్రిల్‌లో అఫ్గానిస్థాన్‌ గనుల శాఖ అధిపతిని కూడా బాంబుపేలుడులో హత్య చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని