China: వారి పేర్లను చైనా వాడేసింది..!

హిందూ మహాసముద్రంలో చైనా బలాన్ని బాగా పెంచి చూపించుకొంటోంది. అది నిర్వహించిన ఓ కార్యక్రమానికి కొన్ని దేశాలు హాజరు కాలేదు. కానీ, ఆయా దేశాల్లో అధికారం కోల్పోయి ఖాళీగా ఉన్న నేతలు పాల్గొన్నారు. వారినే ఆయా దేశాల ప్రతినిధులంటూ డ్రాగన్‌ ప్రచారం చేసుకొంది.  

Published : 28 Nov 2022 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ సంబంధాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేది అధికారంలో ఉన్న నేతలు, రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు. అంతేగానీ ప్రైవేటు వ్యక్తులు కాదు. ఈ విషయం చైనాకు స్పష్టంగా తెలుసు. కానీ, పదవి పోయి ఖాళీగా ఉన్న నేతలు వ్యక్తిగత హోదాలో చైనా కార్యక్రమాల్లో పాల్గొన్నా.. వారిని ఆయా దేశ ప్రతినిధులుగా ప్రచారం చేసుకుంటోంది. తాజాగా క్వాడ్‌కు పోటీగా డ్రాగన్‌ నిర్వహించిన  ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమం విషయం ఇలానే చేసినట్లు వెలుగులోకి వచ్చింది. 

చైనా ఆధ్వర్యంలో నవంబర్‌ 21న నిర్వహించిన ‘ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ ఇనీషియేటివ్‌’ కార్యక్రమంలో 19 దేశాల ప్రతినిధులు పాల్గొన్నట్లు డ్రాగన్‌ వెల్లడించింది. తాము నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా, మాల్దీవుల ప్రతినిధులు పాల్గొన్నారంటూ ఇటీవల ‘ది చైనా ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కోపరేషన్‌ ఏజెన్సీ’ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ, తమ దేశాల ప్రతినిధులు హాజరుకాలేదని ఆ రెండు దేశాలు తెగేసి చెప్పాయి.

ఈ అంశంపై మాల్దీవులు ఆదివారం స్పందిస్తూ ఓ వివరణ జారీ చేసింది. ‘‘మా విదేశాంగ శాఖ ఓ విషయంలో స్పష్టతను ఇవ్వదలుచుకొంది. ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ ఇనీషియేటివ్‌లో మా ప్రతినిధులు పాల్గొనలేదు. తాము పాల్గొనబోమన్న విషయాన్ని మాల్దీవుల్లోని చైనా దౌత్యకార్యాలయానికి నవంబర్‌ 15వ తేదీనే తెలియజేశాం. మాల్దీవుల పౌరులో, ప్రైవేటు బృందమో దీనిలో పాల్గొంటే వారు దేశానికి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించినట్లు కాదు’’ అని పేర్కొంది. 

మరోవైపు భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ బారీ ఓ ఫెర్రల్‌ ట్విటర్‌ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించారు. ‘‘మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా విరుద్ధమైనవి. కున్మింగ్‌లో నిర్వహించిన ఇండియన్‌ ఓషన్‌ సదస్సులో ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారులు ఎవరూ పాల్గొనలేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మంత్రుల స్థాయిలో ఏకైక ఫోరమ్‌ అయిన ‘‘ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌’కు ఎంపీ టిమ్‌ వాట్స్‌ హాజరయ్యారు. దానికి వైస్‌ఛైర్మన్‌ హోదా కోసం భారత్‌ చేసుకొన్న దరఖాస్తును ఆమోదించాం’’ అని పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ కార్యక్రమానికి మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్‌ వహీద్‌ హసన్‌, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్‌ రడ్డ్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. అధికారంలో లేని వారిని ఆయా దేశాల అధికారిక ప్రతినిధుల జాబితాలోకి చైనా చేర్చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని