‘ఇంటి’పనికి వేతనం!.. 25ఏళ్ల సేవలకు రూ.1.75 కోట్లు

స్పెయిన్‌లో ఓ న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఆలోచింపజేస్తోంది. భర్త నుంచి విడాకులు పొందిన భార్యకు వార్షిక కనీస వేతనం ఆధారంగా ఆమె పనికి రూ.1.75 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

Published : 10 Mar 2023 07:22 IST

విడాకులు పొందిన మహిళకు చెల్లించాలని స్పెయిన్‌ కోర్టు ఆదేశం

మాడ్రిడ్‌: కొందరు మహిళలు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ.. తమకు నచ్చినట్లుగా జీవితాన్ని డిజైన్‌ చేసుకుంటారు. వారి ఆర్థిక స్థిరత్వానికి ఢోకా ఉండదు. మరికొందరు కుటుంబం కోసం కెరీర్‌ను త్యాగం చేస్తారు. అనుక్షణం భర్తకు అండగా ఉంటూ.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంటారు. కుటుంబమే లోకంగా జీవిస్తున్న వీరి వివాహ బంధం ముక్కలైతే.. ఇన్నేళ్ల దాంపత్యంలో ఆర్థిక వివరాలు తెలిసుండకపోతే.. ఉన్నపళంగా బయటకు వెళ్లిపోవాల్సి వచ్చిన ఆ మహిళ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఈ తరహా కేసులో స్పెయిన్‌కు చెందిన ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ఆలోచింపజేస్తోంది.

ఇవానా మోరల్‌ అనే స్పెయిన్‌ మహిళ తన వైవాహిక జీవితంలో విభేదాలతో 2020లో భర్త నుంచి విడాకులు పొందారు. తన ఇద్దరు కుమార్తెలతో వట్టి చేతులతో బయటకు వచ్చారు. ‘మా వివాహ బంధం ముగిసిన రోజున నా చేతుల్లో ఏమీ లేదు. అన్నేళ్లు కేవలం ఇంటి పనులకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకాలం నా భాగస్వామికి అన్ని పనుల్లో సహకరించా. కానీ ఆర్థిక విషయాలను నాకు తెలియనిచ్చేవారు కాదు. అన్నీ ఆయన పేరు మీదే ఉన్నాయి’ అని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో ఆ జంటకు విడాకులు ఇచ్చిన న్యాయస్థానం.. కీలక తీర్పును వెలువరించింది. 25ఏళ్ల పాటు ఆమె చేసిన ఇంటి పనికి లెక్క కట్టింది. వార్షిక కనీస వేతనం ఆధారంగా ఆమె పనికి రూ.1.75 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అలాగే నెలవారీగా ఆమెకు భరణం, పిల్లల పోషణ కోసం డబ్బులు ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని