సంక్షిప్త వార్తలు(3)

ఉక్రెయిన్‌కు మిగ్‌-29 యుద్ధవిమానాలందించేందుకు ముందుకొచ్చిన స్లోవేకియాకు ప్రతిఫలంగా 12 నూతన సైనిక హెలికాప్టర్లను అందిస్తామని అమెరికా ప్రకటించింది.

Published : 23 Mar 2023 06:55 IST

స్లోవేకియాకు అమెరికా హెలికాప్టర్లు
ఉక్రెయిన్‌కు యుద్ధవిమానాలిచ్చినందుకు ప్రతిఫలం

బ్రాటిస్లావా: ఉక్రెయిన్‌కు మిగ్‌-29 యుద్ధవిమానాలందించేందుకు ముందుకొచ్చిన స్లోవేకియాకు ప్రతిఫలంగా 12 నూతన సైనిక హెలికాప్టర్లను అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని స్లోవేకియా రక్షణ మంత్రి జరోస్లావ్‌ నాద్‌ బుధవారం వెల్లడించారు. ఆ ప్రకారం మొత్తం బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందంలో బెల్‌ ఏహెచ్‌-1జడ్‌ పోరాట హెలికాప్టర్ల కోసం 340 మిలియన్‌ డాలర్లను అమెరికాకు స్లోవేకియా చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం మేరకు 500 ఏజీఎం-114 హెల్‌ఫైర్‌ 11 క్షిపణులతో పాటు శిక్షణనూ అమెరికా అందిస్తుంది. ఒప్పందంలో మిగిలిన 660 మిలియన్‌ డాలర్లను అమెరికా విదేశీ సైనిక సాయం కింద సర్దుబాటు అవుతుందని నాద్‌ వివరించారు. అదేవిధంగా స్లోవేకియాకు యూరోపియన్‌ యూనియన్‌ కూడా పరిహారంగా 213 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అందించనుంది. ఈ ప్రతిపాదనలను స్లోవేకియా ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. తమ ఆయుధాగారం నుంచి 13 సోవియట్‌ యూనియన్‌ తయారీ మిగ్‌-29 యుద్ధవిమానాలను ఉక్రెయిన్‌కు అందించాలని స్లోవేకియా ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. 


పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ అత్యున్నత అధికారి హతం..

పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐలో రెండో అత్యున్నత అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఐఎస్‌ఐలో బ్రిగేడియర్‌ హోదాలో పనిచేస్తున్న ముస్తఫా కమాల్‌ బార్కీ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ పేర్కొంది. దక్షిణ వజీరిస్థాన్‌లోని అంగూర్‌ అడ్డలో ఈ ఘటన చోటుచేసుకొన్నట్లు పాక్‌ పత్రిక డాన్‌ తెలిపింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముస్తఫా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు పాక్‌ పేర్కొంది. 

ముస్తఫా మృతికి పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ సంతాపం తెలిపారు. ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లిస్తారన్నారు. మరోవైపు పాక్‌ ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ఖాన్‌ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 


క్రూయిజ్‌ క్షిపణులను మోహరిస్తున్న ఉత్తర కొరియా

సియోల్‌: దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తర కొరియా సైతం ఆయుధ పరీక్షలను ముమ్మరం చేసింది. మూడు రోజుల క్రితం డమ్మీ అణ్వాయుధాన్ని పరీక్షించిన కిమ్‌ సేనలు.. బుధవారం క్రూయిజ్‌ క్షిపణులను పరీక్షించాయి. ఈశాన్య తీర పట్టణం హమ్‌హంగ్‌లో ఉత్తర కొరియాలోని ఈ క్షిపణులను ప్రదర్శించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షలపై ఐరాస ఆంక్షలు విధించింది. క్రూయిజ్‌ క్షిపణి పరీక్షలపై నిషేధం లేదు. ఉత్తరకొరియా కొన్ని క్రూయిజ్, ఖండాంతర క్షిపణులను వ్యూహాత్మక ఆయుధాలుగా పేర్కొంటోంది. వీటికి అణ్వాయుధాలను జోడించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. 11 రోజుల దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. తర్వాత సైతం దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు కొనసాగించేందుకు అమెరికా విమాన వాహక యుద్ధనౌకను ఇక్కడకు పంపే అవకాశం ఉందని ఉత్తరకొరియా అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్‌ సేనలు క్షిపణి పరీక్షలను కొనసాగించే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని