kim: రూ.4,500 కోట్ల దోపిడీ.. కిమ్‌ జాతిరత్నాల పనే..!

కిమ్‌ తలుచుకొంటే ఎక్కడి నుంచైనా ఖరీదైన కార్లు ఫ్యాక్‌ అయి.. ప్యాంగ్‌యాంగ్‌ దిశగా బయల్దేరతాయి.. ఉ.కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వము అంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే.

Published : 16 Apr 2022 02:09 IST

 వెల్లడించిన అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఉత్తర కొరియా నియంత కిమ్‌ తలుచుకొంటే ఎక్కడి నుంచైనా ఖరీదైన కార్లు ఫ్యాక్‌ అయి.. ప్యాంగ్‌యాంగ్‌ దిశగా వెళ్తాయి.  ఉ.కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వం అంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే.. వాటిని తప్పించుకొని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టారు. మరి క్రిప్టోలను తయారు చేయడానికి అవసరమైనంత విద్యుత్తు ఉ.కొరియాలో లేదుగా.. అక్కడ చాలా నగరాల్లో రాత్రివేళలు లైట్లు కూడా వేయరు కదా..! అనే సందేహం రావచ్చు. అది నిజమే అయినా.. కిమ్‌ అమ్ములపొదిలో జాతిరత్నాల్లాంటి హ్యాకర్లు ఉన్నారు. వారు బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్‌ఛేంజిల్లోకి చొరబడి దోపిడీ చేయగలరు. ఆ సొమ్ముతో దీపావళీ పటాసుల వలే కిమ్‌ ఆయుధ ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా కిమ్‌ జాతిరత్నాలు ఒక్కదెబ్బకు మరో రూ.4,500 కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీలకు కన్నంపెట్టినట్లు తేలింది.

ఒక్కదెబ్బకు 600 మిలియన్‌ డాలర్లు హాంఫట్‌..!

గత నెల 23వ తేదీన క్రిప్టో కరెన్సీలను సంపాదించడానికి ఆడే యాక్సిస్‌ ఇన్ఫినిటీ అనే ఓ వీడియోగేమ్‌ నెట్‌వర్క్‌ను వాడుకొని ఉత్తరకొరియాకు చెందిన హ్యాకింగ్‌ బృందాలైన లాజరస్‌, ఏపీటీ38లు.. 620 మిలియన్‌ డాలర్ల విలువైన ఇథేరియం అనే క్రిప్టో కరెన్సీని అపహరించాయి. ఈవిషయాన్ని మార్చి 29న అధికారికంగా ప్రకటించారు. యాక్సిస్‌ ఇన్ఫినిటీ అనే గేమ్‌ను స్కైమావిస్‌ అనే కంపెనీ తయారు చేసింది. ఈ వీడియోగేమ్‌లో వినియోగదారులు క్రిప్టోలను ఒకరి నుంచి మరొకరికి పంపే నెట్‌వర్క్‌ను వాడుకొని హ్యాకర్లు ఈ అపహరణకు పాల్పడ్డారు. 

అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ గురువారం లాజరస్‌ గ్రూప్‌పై ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియా ప్రభుత్వం కోసం క్రిప్టోలను సంపాదించేందుకు ఈ గ్రూపు పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ శాఖ ఈ గ్రూపు వినియోగించే వాలెట్‌పై కూడా ఆంక్షలు ప్రకటించింది. 

క్రిప్టో సొమ్ముతో అణుబాంబులు, క్షిపణలు..!

ఉత్తర కొరియా ఆధీనంలోని బృందాలు గత కొన్నేళ్లుగా హ్యాకింగ్‌లతో అక్కడి ప్రభుత్వానికి అవసరమైన నిధులను సంపాదిస్తున్నాయి. ఈ సొమ్ముతో ఉ.కొరియా అణ్వాయుధాలు, క్షిపణలు తయారు చేస్తోందని ఐరాస పరిశోధక బృందాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లలోనే లాజరస్‌ గ్రూప్‌ ఒక్కటే 1.75 బిలియన్‌ డాలర్ల విలువైన సొమ్మును కాజేసినట్లు డిజిటల్‌ కరెన్సీ లావాదేవీల విశ్లేషణ సంస్థ ‘చైన్‌ ఎనాలసిస్‌’ పేర్కొంది.

‘చైన్‌ ఎనాలసిస్‌’ జనవరిలో ప్రచురించిన నివేదిక ప్రకారం ఉ.కొరియా హ్యాకర్లు గత ఏడాది 400 మిలియన్‌ డాలర్లు విలువైన డిజిటల్‌ ఆస్తులను దొంగలించారని పేర్కొంది. 2019లో రెండు బిలియన్‌ డాలర్ల ఆయుధాల తయారీకి  ఈ సొమ్ము వెచ్చించారని.. ఇది హ్యాకింగ్‌ల ద్వారా సంపాదించిందేనని పేర్కొంది. ఆంక్షలు విధించిన ఉ.కొరియాకు మెటీరియల్‌, సాంకేతికత స్వేచ్ఛగా దొరకడానికి ఈ సొమ్మే కారణమని అమెరికా, ఐరాస నిపుణులు భావిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత గత వారం ఆ దేశం తొలిసారి ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది.

బొగ్గు, ‘యాపిల్‌ జ్యూస్‌’.. ఇవే ఉ.కొరియా జీవరేఖలు

సియోల్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ కొరియా లెక్కల ప్రకారం 2020లోనే ఉత్తరకొరియా జీడీపీలో వచ్చిన మొత్తంలో ఏకంగా 8శాతం సైబర్‌ క్రైమ్‌లను ఉపయోగించి సంపాదించిందని బ్యాంక్‌ ఆఫ్‌ సియోల్‌ వెల్లడించింది. ఈ బ్యాంక్‌ ఉ.కొరియా ఆర్థిక వ్యవస్థను కొన్నేళ్లుగా అధ్యయనం చేస్తోంది. 2019 తర్వాత నుంచి ఆ దేశ సరిహద్దులను ఉ.కొరియా మూసివేసింది. దీంతో ఆ దేశానికి రెండు మార్గాల్లోనే ఆదాయం లభిస్తోంది. 

అంతర్జాతీయ ఆంక్షలను అతిక్రమించి బొగ్గు రవాణా చేయడం కూడా ఉ.కొరియా ప్రధాన ఆదాయ వనరు. ఇందుకోసం ఉ.కొరియా నౌకలు బొగ్గు తీసుకొని అంతర్జాతీయ జలాల్లోకి చేరుకొని తమ ఎలక్ట్రానిక్‌ సంకేతాలను ఉపగ్రహాలకు పంపే వ్యవస్థలను ఆపేసి.. రహస్యంగా ఇతర నౌకల్లోకి వాటిని అన్‌లోడింగ్‌ చేస్తాయి.

ఉత్తర కొరియా ప్రభుత్వ క్రిప్టో కరెన్సీల లావాదేవీల నుంచి అపహరణలకు పాల్పడేలా ‘యాపిల్‌ జ్యూస్‌’ పేరిట ఓ మాల్వేర్‌ను వినియోగిస్తోంది. 2018 నుంచి ఈ మాల్వేర్‌లోని పలు వెర్షన్లను వినియోగించి 30 దేశాల్లో సైబర్‌ దాడులు చేసింది. 2019 నుంచి 2020 నవంబర్‌ వరకు ఈ యాపిల్‌ జ్యూస్‌ హ్యాకర్లు 316 మిలియన్‌ డాలర్లను అపహరించారు. 

కిమ్‌ అధికారంలోకి రాగానే హ్యాకర్లకు పెద్దపీట..

కిమ్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి సైబర్‌ వార్ఫేర్‌ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. ఉ.కొరియా నిఘా విభాగం ఈ వ్యహారాలను పర్యవేక్షిస్తోంది. 2021 నాటికి మొత్తం బ్యూరో-21గా పిలిచే సైబర్‌ వార్ఫేర్‌ గైడెన్స్‌ యూనిట్‌లో 6,000 మంది ఉన్నారు. 

వీటిల్లోని  బ్లూనోరోఫ్‌గా పిలిచే బృందంలో 1,700 మంది హ్యాకర్లు ఉన్నారు. వీరు ఫైనాన్షియల్‌ సైబర్‌ క్రైమ్‌లు చేయడంతోపాటు.. ప్రత్యర్థుల నెట్‌వర్క్‌ బలహీతలను సుదీర్ఘకాలంగా అధ్యయనం చేస్తున్నారు. ఆండీరీల్‌ అనే గ్రూపులో మరో 1600 మందికి ప్రత్యర్థుల కంప్యూటర్‌ నెట్‌వర్కుల్లో బలహీనతలను గుర్తించడమే పని. ఈ విషయాలను 2020లో ఉ.కొరియా రక్షణరంగ సామర్థ్యాలపై  అమెరికా సైన్యం తయారు చేసిన నివేదికలో వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. ఈ హ్యాకింగ్‌లకు పాల్పడిన వారికి కొంత మొత్తం రివార్డులు కూడా అక్కడి ప్రభుత్వం ఇస్తోంది. 

అమెరికా అరికట్టలేదా..?

ఉ.కొరియా హ్యాకర్లు దాడి చేస్తున్నారని అమెరికా గుర్తించినా.. వారిపై ప్రతిదాడి చేయడం కష్టతరంగా మారింది. ఆ దేశంలో నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అయిన పరికరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఆక్కడి మొబైల్‌ ఫోన్లకు మిగిలిన వెబ్‌ ప్రపంచంతో సంబంధాలు ఉండవు. దీంతో ఉ.కొరియాపై సైబర్‌ దాడులకు అవకాశాలు పరిమితంగా ఉంటాయి. అంటే కిమ్‌ ప్రభుత్వ హ్యాకర్లను ఇప్పట్లో అడ్డుకోవడం కష్టసాధ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని