Espionage: రష్యాలో అమెరికన్‌ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!

గూఢచర్యం ఆరోపణలతో ఓ అమెరికన్‌ జర్నలిస్టును రష్యా తాజాగా అరెస్టు చేసింది. అగ్రరాజ్యం ఆదేశాల మేరకు అతను పనిచేస్తున్నట్లు ఆరోపించింది.

Published : 31 Mar 2023 01:27 IST

మాస్కో: ఉక్రెయిన్‌ సంక్షోభం (Ukraine Crisis) విషయంలో అమెరికా (America)- రష్యా (Russia)ల మధ్య వివాదం నెలకొన్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. గూఢచర్యం (Espionage) ఆరోపణలతో ఓ అమెరికన్‌ జర్నలిస్టును రష్యా అరెస్టు చేసింది. గురువారం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా సూచనల మేరకు ఓ రష్యన్ రక్షణ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన రహస్యాలను సేకరించేందుకు యత్నించిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (WSJ)కు చెందిన జర్నలిస్టు ఇవాన్‌ గెర్ష్‌కోవిచ్‌ (Evan Gershkovich)ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.

రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (FSB) అతనిపై క్రిమినల్ గూఢచర్యం కేసు మోపింది. అనంతరం మాస్కోలోని ఓ కోర్టులో ప్రవేశపెట్టగా.. మే 29వ తేదీ వరకు నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. రష్యాలో గూఢచర్యం కేసుల్లో దోషిగా తేలితే గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికా- రష్యా(మునుపటి సోవియట్‌ యూనియన్‌)ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానంతరం.. గూఢచర్యం ఆరోపణల కింద మాస్కో అరెస్టు చేసిన మొదటి అమెరికన్‌ జర్నలిస్టు గెర్ష్‌కోవిచ్. అంతకుముందు 1986లో జర్నలిస్ట్ నిక్ డానిలోఫ్‌ను ఇదే విధమైన ఆరోపణలతో నిర్బంధించింది.

క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ ఈ వ్యవహరంపై స్పందిస్తూ.. ‘ఇది ఎఫ్‌ఎస్‌బీకి సంబంధించిన విషయం. మాకు తెలిసినంతవరకు.. అతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు’ అని తెలిపారు. డబ్ల్యూఎస్‌జే ఉద్యోగి చేస్తున్న పనికి జర్నలిజంతో ఎటువంటి సంబంధం లేదని రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు. మరోవైపు వార్తాసంస్థ యాజమాన్యం.. ఎఫ్‌ఎస్‌బీ ఆరోపణలను ఖండించింది. గెర్ష్‌కోవిచ్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు స్వతంత్ర పాత్రికేయులు, విదేశీ వార్తాసంస్థలపై రష్యా అణచివేత ధోరణి అవలంబిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని