USA: ఐదుగురి ప్రాణాల కోసం రూ.49వేల కోట్లు వదులుకున్న అమెరికా

తన పౌరుల ప్రాణాలు కాపాడుకునేందుకు శత్రుదేశమైన ఇరాన్‌ కోసం అమెరికా(USA) తగ్గాల్సి వచ్చింది. వేల కోట్లను వదులుకోవాల్సి వచ్చింది. 

Updated : 19 Sep 2023 17:34 IST

వాషింగ్టన్: కొన్నేళ్లపాటు ఇరాన్‌(Iran) చేతిలో బందీలుగా ఉన్న ఐదుగురు అమెరికన్లు(US citizens) ఎట్టకేలకు విడుదలయ్యారు. స్వదేశానికి పయనమయ్యారు. ఇదే విషయం అయితే పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముండదు..! కానీ వారిని విడుదల చేయించుకోవడానికి అమెరికా(USA) 6 బిలియన్‌ డాలర్లను వదులుకోవాల్సి వచ్చింది. అంటే భారత కరెన్సీలో ఆ డాలర్ల విలువ అక్షరాలా రూ.49వేల కోట్లు. సుదీర్ఘకాలం విరోధులుగా కొనసాగుతోన్న దేశాల మధ్య ఈ అరుదైన మార్పిడి ఒప్పందం జరిగింది. 

ఈ ఐదుగురు అమెరికన్లలో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వారంతా అత్యధికంగా ఎనిమిదేళ్లుగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చెందిన అత్యంత క్రూరమైన ఎవిన్‌ జైలులో బందీలుగా ఉన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధారమైన అభియోగాలతో ఇరాన్‌ వారిని బందీలుగా మార్చిందని అమెరికా ఆరోపించింది. అయితే తాజా ఒప్పందంలో ఖతార్‌(Qatar) మధ్యవర్తిత్వం వహించింది. ఆ మార్పిడి ఒప్పందం చివరి దశకు చేరుకుంటుందన్న సూచనలు రాగానే.. ఇరాన్‌ ప్రభుత్వం వారిని ఎవిన్‌ జైలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం గమనార్హం. దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్‌కు చెందిన నిధులు దోహా బ్యాంకులకు చేరుకోగానే.. ఈ పౌరులు టెహ్రాన్‌ నుంచి దోహాకు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు.

మహిళా ఎంపీనే తోసిన ప్రధాని.. ట్రూడో చుట్టూ వివాదాలెన్నో..!

అలాగే అమెరికా ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలతో యూఎస్‌ జైల్లో ఉన్న ఐదుగురు ఇరానియన్లకు కూడా ఈ ఒప్పందంలో భాగంగా క్షమాభిక్ష లభించింది. ఈ ఖైదీల మార్పిడి కోసం ఖతార్‌ మధ్యవర్తిత్వంలో గత ఏడాది ఫిబ్రవరిలో చర్చలు మొదలయ్యాయి. తొమ్మిది రౌండ్లలో ఈ చర్చలు జరగ్గా.. అందుకోసం ఖతార్‌ అధికారులు టెహ్రాన్‌, వాషింగ్టన్ మధ్య చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. 

‘ఇరాన్‌ జైల్లో బంధించిన ఐదుగురు అమాయకులైన అమెరికన్లు ఎట్టకేలకు స్వదేశానికి వస్తున్నారు. ఆ ఐదుగురు ఏళ్లపాటు అంతులేని వేదనను అనుభవించారు’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తమను కాపాడటానికి బైడెన్‌ అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నారని,  రాజకీయాలను పక్కనపెట్టి తమ ప్రాణాలకు ప్రాధాన్యం ఇచ్చారని వారు బైడెన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.  

ఈ ఆరు బిలియన్ల డాలర్లు.. అమెరికా ఆంక్షలతో స్తంభించిపోయిన ఇరాన్‌ ఆస్తుల్లో భాగం కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుత ఒప్పందాన్ని రిపబ్లికన్లు ఖండిస్తున్నారు. విడుదలకు ప్రతిగా చెల్లింపు, ఆంక్షల్లో సడలింపుగా దీనిని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశాల వరుసలో ముందున్న ఇరాన్‌కు అమెరికా నిధులు బదిలీ చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని