India-China: దెబ్బకు ఠా.. చైనా ముఠా!
గల్వాన్ తరహా దాడితో భారత సేనకు భారీ ప్రాణనష్టం కలిగిద్దామని చైనా ఘనంగా రూపొందించుకున్న వ్యూహం బెడిసికొట్టింది.
గల్వాన్ తరహా దాడితో భారత సేనకు భారీ ప్రాణనష్టం కలిగిద్దామని చైనా ఘనంగా రూపొందించుకున్న వ్యూహం బెడిసికొట్టింది. ప్రత్యర్థిని తక్కువగా అంచనావేసిన డ్రాగన్.. పప్పులో కాలేసింది. ఆ దేశ ఎత్తుగడలను ఓరకంట గమనించిన మన సేన ముందుగానే అప్రమత్తమై, ప్రతివ్యూహాన్ని అమలు చేయడంతో చైనా సైనికులకు చావుదెబ్బలు మిగిలాయి. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కీలక వివరాలు మిలటరీ వర్గాల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ముందే పసిగట్టి..
* తవాంగ్ పరిసరాల్లో చైనా బలగాల తీరులో ఏదో తేడా ఉన్నట్లు భారత సైన్యం నవంబరు చివర్లోనే పసిగట్టింది. ఆ నెల 15న జి-20 సదస్సులో ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన కొద్దిరోజులకే ఇలాంటి మార్పు జరగడం గమనార్హం.
* చైనా సైనిక గస్తీ బృందాల హడావుడి పెరగడాన్ని గుర్తించిన భారత బెటాలియన్ కమాండర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
* క్రమంగా వేడి రాజుకోవడం మొదలైంది. ఇరు దేశాల గస్తీ బృందాలు తరచూ ఎదురుపడటం, ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది.
చొరబాటుకు యత్నించొచ్చు..
ఈ పరిణామాల నేపథ్యంలో మన బలగాల సంఖ్యను అధికారులు పెంచారు. ఆధిపత్యాన్ని చాటుకునేందుకు మన భూభాగంలోకి డ్రాగన్ సేన చొరబడొచ్చని అంచనా వేశారు. ఇలాంటి పరిణామాలకు ఎక్కడెక్కడ ఆస్కారం ఉందన్నదానిపై విశ్లేషించారు. చీకట్లోనూ వీక్షించేందుకు సాయపడే థర్మల్ ఇమేజర్లను ఉపయోగిస్తూ నిఘా పెట్టారు.
* తవాంగ్లోని యాంగ్జే ప్రాంతంలో హిమపాతం మాటున గప్చుప్గా చైనా తన సైనికుల సంఖ్య క్రమంగా పెంచుకోవడాన్ని డిసెంబరు 8వ తేదీ రాత్రి మనవాళ్లు పసిగట్టారు.
విరుగుడు సిద్ధం..
క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న ఆ ప్రాంతంలోని భారత బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్.. ఈ నెల 9న ఉదయం 6 గంటలకు స్థానిక కమాండర్లకు కీలక ఉత్తర్వులు జారీచేసింది. సైన్యంలోని సుశిక్షిత సత్వర స్పందన దళాల (క్విక్ రియాక్షన్ టీమ్- క్యూఆర్టీ)ను రంగంలోకి దించాలని నిర్దేశించింది.
* తన కుట్రలు, మోహరింపులను భారత సైన్యం గమనిస్తోందని, దానికి విరుగుడును సిద్ధం చేసిందని తెలియని డ్రాగన్ సేన.. తప్పుడు అంచనాలతో రంగంలోకి దిగింది. యాంగ్జే ప్రాంతంలో 50 మంది భారత సైనికులే ఉండొచ్చని లెక్కలువేసుకొని, వారిని ఎదుర్కోవడానికి 300 మందిని పంపింది. అక్కడికి కొద్ది దూరంలో మోహరించిన మన క్యూఆర్టీ బలగాలను చైనా గుర్తించలేకపోయింది.
ఘర్షణ ఇలా..
ఈ నెల 9న.. ముందుగా నిర్దేశించుకున్న సమయానికి చైనా సైనికులు మన భూభాగంవైపు రావడం మొదలుపెట్టారు. వారిని 50 మంది భారత జవాన్లు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
* కొద్దిగా దూరంలో మాటువేసిన చైనా అదనపు బలగాలు ప్రత్యర్థికి షాక్ కలిగించే ఎలక్ట్రిక్ కర్రలు, మేకులతో కూడిన కట్టెలు వంటి ఆయుధాలతో అకస్మాత్తుగా ముందుకు దూసుకొచ్చి, భారత సైనికులపై దాడికి దిగాయి.
* సరిగ్గా ఈ దశలో భారత క్యూఆర్టీ రంగంలోకి దూకింది. చిన్నబృందాలుగా విడిపోయి.. ప్రత్యర్థి సైనికులను చుట్టుముట్టింది. గల్వాన్ అనుభవాల దృష్ట్యా మన క్యూఆర్టీలు ఈసారి కర్రలు, మేకులతో కూడిన కట్టెలను ముందుగానే సిద్ధం చేసుకున్నాయి. వీటి దెబ్బను ప్రత్యర్థులకు రుచి చూపించడం మొదలుపెట్టాయి.
* ఈ హఠాత్పరిణామానికి డ్రాగన్ సైనికులు బిత్తరపోయారు. ఇంతమందితో తలపడడానికి తాము సిద్ధమైరాలేదని ఆలోచనలో పడ్డారు. ఈలోగా వీరి ఆయుధాలను మన సైనికులు గుంజుకొని దేహశుద్ధి చేశారు.
* దీంతో చైనా సైనికులు తోకముడిచారు. పరారవుతున్న డ్రాగన్ సైనికులను మనవాళ్లు వెంటాడి మరీ చితకబాదారు. కొద్దిదూరంలో ఉండి దీన్ని గమనిస్తున్న చైనా కమాండర్లు.. తమవారిని రక్షించుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఘర్షణ ఆగింది.
* మనవాళ్ల దాడిలో 10-15 మంది చైనా సైనికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరు చనిపోయి ఉండొచ్చని భారత సైనికాధికారుల అంచనా.
చైనా జెట్ల రొద..!
తవాంగ్ ఘర్షణ తర్వాత టిబెట్లోని తన వైమానిక స్థావరాల్లో పెద్ద సంఖ్యలో డ్రోన్లు, యుద్ధవిమానాలను చైనా మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలోని బంగ్డా వైమానిక స్థావరంలో డబ్ల్యూజడ్-7 సోరింగ్ డ్రాగన్ డ్రోన్ కనిపించింది. ఇది నిరంతరాయంగా 10 గంటల పాటు గగన విహారం చేయగలదు. నిఘా సమాచారాన్ని క్షిపణులకు చేరవేయగలదు. షింగాట్సే విమానాశ్రయంలో ఫ్లాంకర్ తరహా యుద్ధవిమానాలు, కేజే-500 గగనతల ముందస్తు హెచ్చరిక విమానాలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో అరుణాచల్లో భారత వాయుసేన గగనతల గస్తీ ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలో ఇటీవల రెండుసార్లు చైనా యుద్ధవిమానాలు హద్దు మీరేందుకు ప్రయత్నించగా.. మన జెట్లు వాటిని తరిమేశాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్