అమెరికా జడ్జిగా ఎదిగిన బీడీ కార్మికుడు

కేరళలో ఒకప్పుడు బీడీ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా జడ్జి అయ్యారు.

Published : 07 Jan 2023 05:57 IST

కేరళవాసి విజయగాథ

టెక్సాస్‌: కేరళలో ఒకప్పుడు బీడీ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి.. ఇప్పుడు అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా జడ్జి అయ్యారు. ప్రతిభ, పట్టుదల ఉంటే.. పేదరికం అడ్డు కాబోదని మరోమారు నిరూపించిన సురేంద్రన్‌ కె.పటేల్‌ విజయగాథ ఇది. టెక్సాస్‌ జడ్జిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సురేంద్రన్‌ జీవనయానం గురించి ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఆ పత్రికతో ఆయన తన జీవితంలోని ఎత్తుపల్లాల గురించి పలు విషయాలు పంచుకున్నారు. చిన్నప్పుడు కేరళలో బీడీలు చుట్టడానికి వెళ్లటం నుంచీ అమెరికా వరకు సాగిన ప్రయాణాన్ని వివరించారు.

డ్రాపౌటు.. హోటలు కార్మికుడిగా..

కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన సురేంద్రన్‌ రోజువారీ కూలీ కుటుంబంలో జన్మించారు. ఇంటిల్లిపాదీ పనిచేస్తే గానీ పూట గడవని పరిస్థితి. దీంతో సురేంద్రన్‌ తన సోదరితో కలిసి బీడీలు చుట్టడానికి వెళ్లేవారు. ఇతర కూలీ పనులూ చేసేవారు. పదో తరగతి తర్వాత చదువు కొనసాగించడం కష్టమై పూర్తిగా బీడీలు చుట్టే పనిలో నిమగ్నమయ్యారు. అలా ఏడాది గడిచింది. పనిచేయడం ద్వారా ఆదాయం వస్తున్నా.. ఏదో వెలితి. చదువుకోకపోవడంతో ఏదో కోల్పోతున్నానన్న బాధ ఆయనను వేధించింది. దీంతో తిరిగి చదువును కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఓ ప్రభుత్వ కళాశాలలో చేరి.. ఓవైపు చదువుతూనే మరోవైపు కూలి పనులు సైతం కొనసాగించారు. కూలి పనులతో హాజరీ తక్కువగా ఉందని పరీక్షలకు అనుమతించలేదు. ప్రాధేయపడితే చివరికి  అనుమతించారు.  ఆ పరీక్షల్లో సురేంద్రన్‌ టాపర్‌గా నిలిచారు. తర్వాత కాలికట్‌ ప్రభుత్వ లా కళాశాలలో చేరారు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా.. స్నేహితుల సాయంతో మొదటి ఏడాది పూర్తి చేశారు. ఓ హోటలులో పనిచేస్తూ 1995లో లా డిగ్రీని పూర్తి చేశారు.

భారత సుప్రీంకోర్టు న్యాయవాదిగా..

కాసర్‌గోడ్‌ జిల్లాలోని హోజ్‌దుర్గ్‌ కోర్టులో జూనియర్‌ లాయర్‌గా ప్రాక్టీసు మొదలుపెట్టిన సురేంద్రన్‌ తక్కువ కాలంలోనే మంచిపేరు తెచ్చుకున్నారు. ఓ స్నేహితుడి ద్వారా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ పరిచయం కావడం ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2004లో శుభతో జరిగిన వివాహం సురేంద్రన్‌ జీవితంలో పెద్ద మార్పునకు నాంది పలికింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమెకు అమెరికాలో స్టాఫ్‌నర్సు ఉద్యోగం రావడంతో.. వీరి కుటుంబం హ్యూస్టన్‌ చేరింది. అమెరికాలో టెక్సాస్‌ బార్‌ ఎగ్జామ్‌ ఉత్తీర్ణుడైన సురేంద్రన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ లా సెంటర్‌ నుంచి 2011లో ఎల్‌ఎల్‌ఎం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. లాయర్‌గా అక్కడా మంచి పేరు తెచ్చుకొని.. టెక్సాస్‌ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. కోర్టులో కొందరు తన యాసను తప్పుబట్టగా.. ‘ఓ దేశంలో మనం ఎంతకాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఆ సమాజానికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం’ అంటూ విమర్శలను తిప్పికొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని