ఐఎంఎఫ్‌కు తలొగ్గుతాం: పాక్‌ ప్రధాని

ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్‌ను గట్టెక్కించడానికి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, పాక్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ పార్టీ నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు.

Updated : 26 Jan 2023 06:11 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్‌ను గట్టెక్కించడానికి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి, పాక్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ పార్టీ నాయకుడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. మంగళవారం ఇక్కడ వ్యాపారాలు, వ్యవసాయం కోసం ప్రధానమంత్రి యువ రుణ మేళాను ఆయన ప్రారంభించారు. పాక్‌కు ఆర్థిక సహాయం అందించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) పెట్టిన కఠిన షరతులకు తలొగ్గుతామనీ, దీనికి రాజకీయ మూల్యం చెల్లించడానికి వెనుకాడమని షెహబాజ్‌ చెప్పారు. ఐఎంఎఫ్‌ చెప్పిన ప్రకారం ఆర్థిక సహాయం తీసుకుంటే తాము కూడా పాక్‌ను ఆర్థికంగా ఆదుకుంటామని మిత్ర దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చెబుతున్నాయని ఆయన అన్యాపదేశంగా వెల్లడించారు. ఐఎంఎఫ్‌ నుంచి 600 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం తీసుకోవడానికి 2019లోనే పాకిస్థాన్‌ అంగీకరించినా, ఆ సంస్థ పెట్టిన కఠిన షరతుల వల్ల వెనకడుగు వేస్తోంది. తాము నిధులివ్వాలంటే పాకిస్థాన్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలనీ, అంతర్జాతీయ విపణి ధరలకు తగ్గట్టు గ్యాస్‌ ఛార్జీలను నిర్ణయించాలనీ, పాక్‌ రూపాయి మారక విలువను మార్కెట్‌ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎంఎఫ్‌ షరతులు పెట్టింది. గత డిసెంబరులో 24.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఐఎంఎఫ్‌ షరతుల వల్ల మరింత పెరిగిపోతుందని పాకిస్థాన్‌ సంకీర్ణ ప్రభుత్వం భయపడుతోంది.

ఉద్యోగుల జీతాల్లో కోత!: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో 10 శాతం కోత పెట్టడంతో సహా పలు ప్రతిపాదనలను పాక్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధాని షెహబాజ్‌ నియమించిన జాతీయ పొదుపు సలహా సంఘం ప్రభుత్వ శాఖల ఖర్చులను 15 శాతం తగ్గించాలనీ, మంత్రిమండలి సభ్యులు, సలహాదారుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలనీ ప్రతిపాదించింది. ఈ సిఫార్సులను బుధవారం ఖరారు చేసి ప్రధానికి పంపుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని