సంక్షిప్త వార్తలు (5)

అమెరికాలోని రిపబ్లికన్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి (ఆర్‌ఎన్‌సీ) పోటీ పడిన ప్రముఖ ఇండియన్‌-అమెరికన్‌ హర్మీత్‌ థిల్లాన్‌  ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న రోనా మెక్‌డేనియల్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Updated : 29 Jan 2023 05:55 IST

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో హర్మీత్‌ థిల్లాన్‌ ఓటమి

వాషింగ్టన్‌: అమెరికాలోని రిపబ్లికన్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి (ఆర్‌ఎన్‌సీ) పోటీ పడిన ప్రముఖ ఇండియన్‌-అమెరికన్‌ హర్మీత్‌ థిల్లాన్‌  ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న రోనా మెక్‌డేనియల్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. శుక్రవారం జరిగిన రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌లో రోనా 111, హర్మీత్‌ థిల్లాన్‌ 51 ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోనాకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయని థిల్లాన్‌ పేర్కొన్నారు. ఆమె గతంలో కాలిఫోర్నియా రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు.


చెక్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా పావెల్‌ ఎన్నిక

ప్రాగ్‌: చెక్‌ రిపబ్లిక్‌ కొత్త అధ్యక్షుడిగా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్‌ పెట్ర పావెల్‌ శనివారం ఎన్నికయ్యారు. బిలియనీర్‌ ఆండ్రెజ్‌ బబీస్‌ను ఓడించి, ఆ పదవిని కైవసం చేసుకున్నారు. కడపటి వార్తలు అందేటప్పటికి 99.5 శాతం పోలింగ్‌ కేంద్రాల్లోని బ్యాలెట్‌ పేపర్లను లెక్కించారు. పావెల్‌కు 58.2 శాతం, బబీస్‌కు 42.8 శాతం ఓట్లు దక్కాయి. పావెల్‌.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో నాటో కూటమిలోని సైనిక కమిటీకి నేతృత్వం వహించారు.


యూఎస్‌ వీసా జారీ ప్రక్రియ మరింత వేగవంతం
అమెరికా కాన్సులేట్‌ ఉన్నతాధికారి

దిల్లీ: భారతీయుల వీసా దరఖాస్తులను ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రాసెస్‌ చేస్తామని ముంబయిలోని యూఎస్‌ కాన్సులేట్‌ ఉన్నతాధికారి జాన్‌ బల్లార్డ్‌ శనివారం ప్రకటించారు. ప్రతి వీసా కేటగిరీలో పెరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు యూఎస్‌ రాయబార కార్యాలయంతో పాటు కాన్సులేట్‌లు ప్రణాళికతో ముందుకు వెళతాయని తెలిపారు. ఇటీవలే 2.5 లక్షల బీ1, బీ2 వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని వెల్లడించారు. వీటికి సంబంధించి ముఖాముఖి ప్రక్రియను వేగవంతం చేయడానికి వాషింగ్టన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూఎస్‌ ఎంబసీలు నుంచి వచ్చిన అధికారులను నియమించామని జాన్‌ బల్లార్డ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ వీసా రావాలంటే 60 నుంచి 280 రోజలు, పర్యాటక వీసాకు సుమారు 18 నెలల సమయం పడుతోంది.


ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్ర:: భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ఛత్ర జిల్లాలో శనివారం జరిగిందని పోలీసులు వెల్లడించారు. రాంచీకి 250 కి.మీ దూరంలోని అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, పోలీసు బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరిపారని ఎస్పీ రాకేశ్‌ రంజన్‌ తెలిపారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా స్పందించడంతో పారిపోయారని, అనంతరం ఒక మావోయిస్టు మృతదేహం లభించిందని వివరించారు. మృతుడిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

160 ఐఈడీల స్వాధీనం

బిహార్‌లో నక్సల్స్‌ ఏరివేత చర్యలు చేపట్టిన సీఆర్‌పీఎఫ్‌ బృందానికి 160 ఐఈడీ పేలుడు పదార్థాలు లభించాయని అధికారులు వెల్లడించారు. ఔరంగాబాద్‌ జిల్లాలోని లదూయియా పహాడ్‌ ప్రాంతంలో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


జాతీయగీతాన్ని అవమానించిన ముగ్గురు యువకులు
అదుపులోకి తీసుకున్న యూపీ పోలీసులు

మేరఠ్‌: గణతంత్ర దినోత్సవాన జాతీయ గీతాన్ని అవమానపరిచిన ముగ్గురు యువకులపై శనివారం ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ) పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘జాతీయ గీతాలాపన జరుగుతుండగా ముగ్గురు యువకులు నృత్యం చేసిన వీడియో వైరల్‌ అయింది. విచారణలో అద్నాన్‌, రుహాల్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నాం’’ అని మేరఠ్‌లోని రైల్వే రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు. 29 సెకన్ల వీడియోలో అద్నాన్‌.. ఆరంభంలో జాతీయ గీతం ఆలాపన జరిగినపుడు జెండాకు వందనం చేస్తూ కనిపించాడు. కొంతసేపైనా తర్వాత ఎగతాళిగా నృత్యం చేయడం ఆరంభించారు. పక్కనే ఉన్న అతని స్నేహితులు నవ్వుతూ కనిపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని